బెంగాల్లో భారీగా పోలింగ్- బీజేపీపై టీఎంసీ ఈవీఎంలు ట్యాంపరింగ్ ఆరోపణలు
పశ్చిమబెంగాల్లోని ఐదు జిల్లాల్లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్లో మహిళా ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు జరుగుతున్న పెద్దగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. తొలి నాలుగు గంటల్లో రాష్ట్రంలో 28.13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
పశ్చిమబెంగాల్లో ఎన్నికల జరుగుతున్న పూరూలియా, మిడ్నాపూర్ జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్నందున భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయినా ఓటర్లు నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. నిన్న మిడ్నాపూర్లో బీజేపీ కార్యకర్త హత్య మినహా ఇతరత్రా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. అయితే పోలింగ్ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంపై ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కాశీపూర్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియపై అధికార తృణమూల్ కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక్కడ తృణమూల్కు ఓటేస్తే బీజేపీకి పడుతుందన్న ఆరోపణలు రావడంతో టీఎంసీ నేతలు విమర్శలకు దిగారు. బీజేపీ ఈవీఎంలను ట్యాంపర్ చేసి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తోందని టీఎంసీ ఆరోపించింది. పలు చోట్ల బీజేపీ నేతలు బూత్ల ఆక్రమణలు పాల్పడి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రానివ్వకుండా చేస్తున్నారని కూడా ఆరోపణలు చేసింది. కాశీపూర్, గార్బెటా నియోజకవర్గాలో బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు.