2019 ఎన్నికలు: బెంగాల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోనున్న కమ్యూనిస్ట్ పార్టీ..?
2019 లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పొత్తులపై చర్చలు తెరపైకి వస్తున్నాయి. ఇక కొన్ని దశాబ్దాల వరకు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పాగా వేసింది. అయితే లోక్సభ ఎన్నికల్లో సీపీఐఎం కాంగ్రెస్తో కలిసి పోటీచేయాలని భావిస్తోంది. అంతేకాదు భావసారూప్యత ఉన్న ఇతర పార్టీలతో కూడా కలిసి పోటీచేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. దీనిపై ఒకరోజు పాటు సమావేశం నిర్వహించి చర్చించడం జరిగింది. బెంగాల్లో 42లోక్సభ స్థానాలున్నాయి.
బెంగాల్ లోక్సభ ఎన్నికలపై సమావేశంలో చర్చించిన మెజార్టీ నేతలు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే వాదన వినిపించారు. కాంగ్రెస్తో కలిసి వెళితే తృణమూల్ కాంగ్రెస్ బీజేపీలను అడ్డుకోవచ్చనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కోల్కతా, బురద్వాన్, జల్పాయ్గురి జిల్లా సీపీఐఎం నేతలు మాత్రం కాంగ్రెస్తో పొత్తును వ్యతిరేకించారు. కాంగ్రెస్ ఒక భావసారూప్యత ఉన్న పార్టీ అని అందరికీ తెలిసిందే.. అయితే బీజేపీలాంటి మతతత్వ పార్టీపై పోరాటం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ను అంటరాని పార్టీగా చూడటం తగదని కమ్యూనిస్ట్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
బెంగాల్లోని అన్ని జిల్లాల్లో ఎక్కడైతే కాంగ్రెస్తో సీట్ల పంపకాలకు వెళ్లొచ్చో అనే జాబితాను తయారు చేయాల్సిందిగా కమ్యూనిస్టు అధినాయకత్వం ఆయా జిల్లాల నేతలకు సూచించినట్లు సమాచారం. ఈ నివేదిక తర్వాత మరోసారి సమావేశం నిర్వహించి చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటారు. ఇక బుధవారం జరిగిన సమావేశంలో సీపీఎం పార్టీ ఎక్కడైతే మెజార్టీ సీట్లు సొంతంగా గెలువగలదో అనే విషయం పై కూడా చర్చించినట్లు సీనియర్ నేత ఒకరు తెలిపారు. బెంగాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులకు పెద్దగా గెలిచే అవకాశంలేదనే సత్యాన్ని ఒప్పుకుని తీరాలని ఒక నేత చెప్పారు. కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తే ఏయే స్థానాల్లో గెలుస్తామనేదానిపై స్టడీ చేయాల్సి ఉందన్నారు.