బెంగాల్ ఆరోదశ పోలింగ్- 11 గంటలకు 37 శాతం- ఓటర్లకు ప్రధాని మోడీ, షా విజ్ఞప్తి
పశ్చిమబెంగాల్లో ఆరో దశ పోలింగ్ చురుగ్గా సాగుతోంది. ఉదయం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు పలు నియోజకవర్గాల్లో ఓటర్లు బారులు తీరారు. 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు భారీగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
పశ్చిమబెంగాల్లో ఆరో దశ అసెంబ్లీ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో మూడుదశల పోలింగ్ను ఒకటి లేదా రెండు దశలకు కుదించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేసినా ఈసీ పట్టించుకోలేదు. ఇప్పటికే మూడు దశల పోలింగ్కు ఏర్పాట్లు చేసినట్లు చెప్పేసింది. దీంతో ఇవాళ ఆరో దశ ఎన్నికలు నిరాటంకంగా సాగిపోతున్నాయి. ఆరోదశలో భాగంగా 43 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల్లో 306 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు.

ఇవాళ ఎన్నికలు జరుగుతున్న ఉత్తర దినాజ్పూర్లో 11 గంటల కల్లా 40 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే నాదియాలో 38 శాతం, నార్త్ 24 పరగణాల్లో 32 శాతం, పూర్వ బర్దమాన్లో 41 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో సగటున ఈ దశలో 70 శాతం వరకూ పోలింగ్ జరగొచ్చని అంచనా వేస్తున్నారు. కీలకమైన నార్త్ 24 పరగణాల జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎన్నికలు బీజేపీతో పాటు తృణమూల్ కాంగ్రెస్కూ కీలకంగా మారడంతో ఈ ఫలితాలపైనా ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications