టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎంతోపాటు రాత్రంతా ఎన్నికల అధికారి: వేటు పడింది
కోల్కతా: ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఉలుబేరియాలోని ఓ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంట్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం) లభ్యమైంది. అంతేగాక, ఈవీఎంతోపాటు ఎన్నికల సెక్టార్ అధికారి కూడా టీఎంసీ నేత ఇంట్లోనే రాత్రంతా పడుకోవడం గమనార్హం.
టీఎంసీ లీడర్ గౌతమ్ ఘోష్ ఇంటికి సోమవారం రాత్రి తపన్ సర్కార్ అనే ఎన్నికల అధికారి. ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను తీసుకెళ్లారు. సదరు రాజకీయ నేత ఈ ఎన్నికల అధికారికి బంధువని సమాచారం. అయితే, ఎన్నికల విధుల్లో ఉండి బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించిన సదరు అధికారిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆ ఈవీఎం యంత్రాలను కూడా ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించింది.
ఈ వ్యవహరంతో సంబంధమున్న ఇతర అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని ఎన్నికల ఉన్నతాధికారులు మంగళవారం తెలిపారు. భారత ఎన్నికల సంఘం ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్న ఇలాంటి చర్యలను తాము ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. కాగా, తాను విశ్రాంతి తీసుకునేందుకు తన బంధువు ఇంటికి వెళ్లానని తపన్ సర్కార్ చెప్పుకొచ్చారు. కారులోనే ఈవీఎంలను ఉంచడం సమస్య అవుతుందని ఇలా చేసినట్లు తెలిపారు.
కాగా, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం మూడో దశ ఎన్నికలు జరిగాయి. 31 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరిగాయి. అస్సాంలో ఓ బీజేపీ నేత కారులో ఈవీఎంలు లభించిన మరుసటి రోజే పశ్చిమబెంగాల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో నలుగురు పోలింగ్ అధికారులను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది.