అబ్బే అలా అనలేదు.. మోడీ అంటే షాకు గౌరవం: అంతలోనే మారిన సత్యపాల్ స్వరం
ప్రధాని మోడీపై మేఘాలయా గవర్నర్ సత్యపాల్ మాలిక్ హాట్ కామెంట్స్ కలకలం రేపాయి. అంతేకాదు అమిత్ షా కూడా వ్యాఖ్యలు చేశారనడం.. ఆ వీడియో దుమారం రేపింది. దీంతో సత్యపాల్ మాలిక్ దిగొచ్చారు. అసలు ఏం జరిగింది.. తాను ఏమన్నానో వివరిచారు. అమిత్ షా ప్రధాని మోడీని కించపరిచేలా కామెంట్ చేయలేదని స్పష్టంచేశారు. తన పేరుతో జరుగుతున్న వీడియో, ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఎవరో కావాలని ఇలా చేశారని తోసిపుచ్చారు.
అమిత్ షా మోడీని చాలా గౌరవస్తారని మాలిక్ తెలిపారు. ప్రజలు ప్రధానిని తప్పుదోవ పట్టిస్తున్నారని షా తనతో అన్నారని చెప్పారు. వ్యవసాయ చట్టాల రద్దుపై ఒకరోజు మోడీ నిర్ణయం తీసుకుంటారని తనతో అన్నారని చెప్పారు. అంతేకానీ దురుద్దేశంతో ఏమీ అనలేదని చెప్పారు. అలా చెప్పినట్టే తర్వాత ప్రకటన చేశారని గుర్తుచేశారు. జాతికి క్షమాపణలు చెప్పి.. తర్వాత వ్యవసాయ చట్టాలను రద్దుచేసిన సంగతి తెలిసిందే.
ఏడాదిపాటు ఆందోళన చేసినా.. పంజాబ్, యూపీ సహా 5 రాష్ట్రాల ఎన్నికల వేళ మోడీ సర్కార్ వెనక్కి తగ్గింది. ఇదీ పక్కా ఓటు బ్యాంకు రాజకీయమే అని అనుకోవచ్చు. అంతేకాదు తాను చెప్పిన సమయంలో చట్టాలు వెనక్కి తీసుకుంటే.. రైతులు చనిపోయి ఉండేవారు కాదని మాలిక్ అన్నారు. చట్టాలకు సంబంధించి ప్రజలతో కఠినంగా ఉండొద్దు అని సూచించారు. అంతేకాదు ప్రతిపక్షాలు విమర్శలు చేయడంపై కూడా మాలిక్ స్పందించారు. ఇదీ అంతర్గత సమస్య అని.. కాంగ్రెస్ జోక్యం చేసుకోవద్దు అని కోరారు.
అంతకుముందు ప్రధాని మోడీ ఓ పొగరుబోతని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మండిపడ్డారు. రైతు సమస్యలపై చర్చించేందుకు మోడీతో భేటీ అయిన సమయంలో అహంకారముతో వ్యవహరించారని, అందుకే ఐదు నిమిషాల్లో సమావేశాన్ని ముగించినట్లు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ప్రధానికి మతిపోయిందని కామెంట్ చేశారని తెలిపారురు. 500 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని చెప్పగానే.. కోపంతో ఊగిపోయిన మోడీ.. నా కోసమేమన్నా చనిపోయారా?' అంటూ ప్రశ్నించారని అన్నారు. 'అవును... నువ్వు ఈ దేశానికి ప్రధాని అయిన నాటి నుండే ఇలా జరుగుతోంది' అని సమాధానమిచ్చానని తెలిపారు. వెంటనే మోడీ.. అమిత్షాను కలవమని అన్నారని, తాను ఆయన్ను కలిశానని అన్నారు. కుక్క చనిపోతేనే సంతాపం తెలిపే ప్రధాని మోడీ.. ఇంత మంది రైతులు చనిపోతే.. పట్టనట్లు వ్యవహరించారని షా విమర్శించారని చెప్పారు. ఈ కామెంట్లపై దుమారం రేగడంతో మాలిక్ స్పందించారు. తాను అలా అనలేదని స్పస్టంచేశారు.