ఆర్టికల్ 370 రద్దుపై ఏం చెప్పాలనుకున్నారు.. పిటిషనర్పై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం, విచారణ వాయిదా
న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ శర్మపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ లోపభూయిష్టంగా ఉందని .. ఏం చెప్పాలనుకున్నారో అర్థం కాలేదన్నారు. పిటిషన్లో సవరణలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయవాది శర్మ కోరారు.
కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది శర్మపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్లో ఏం చెప్పాలనుకున్నారని ప్రశ్నించింది. పిటిషన్ను అరగంటపాటు చదివినా .. పిల్ ఉద్దేశం ఏంటో అర్థం కాలేదన్నారు. ఈ పిటిషన్ కొట్టివేస్తే దీని ప్రభావం సంబంధిత ఐదు పిటిషన్లపై పడుతుందన్నారు. కశ్మీర్కు సంబంధించి మొత్తం 7 పిటిషన్లు రాగా .. అందులో నాలుగు లోపాభూయిష్టంగా ఉన్నాయి. దీంతో సుప్రీంకోర్టు సీజే అసహనం వ్యక్తం చేశారు. పిటిషన్లో సవరణలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయవాది శర్మ ధర్మసనానికి విన్నవించారు.
మరోవైపు కశ్మీర్లో మీడియా, కమ్యూనికేషన్ వ్యవస్థపై విధించిన ఆంక్షలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధా బేసిన్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది. కశ్మీర్లో ల్యాండ్ లైన్ వ్యవస్థ సరిగా ఉందని జస్టిస్ ఎస్ఏ బాబ్డే తెలిపారు. ఈ రోజు కూడా కశ్మీర్ హైకోర్టు చీఫ్ జస్టిస్తో మాట్లాడినట్టు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ .. కశ్మీర్లో పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నాయని తెలిపారు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తన్నామని .. దశలవారీగా ఆంక్షలు తొలగిస్తామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి మరింత సమయం ఇవ్వాలని ధర్మాసనం నిర్ణయానికి వచ్చింది. ఈ కేసు విచారణ మరోసారి విచారిద్దామని వాయిదా వేసింది. అయితే ఎప్పుడు విచారిస్తామనే తేదీని మాత్రం వెల్లడించలేదు.