అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి ?- రూల్స్ ఎలా ఉంటాయి ? గతంలో ముగ్గురు ప్రధానులకు షాక్ !
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్ధలో ఎన్నికైన ప్రభుత్వాలపై విపక్షాలు విశ్వాసం కోల్పోయినప్పుడు, దాని పాలనా సామర్ధ్యాన్ని సవాల్ చేయడానికి రాజ్యాంగం కల్పించిన ఓ సదవకాశం అవిశ్వాస తీర్మానం. అలాగే పార్లమెంటులో లేదా రాష్ట్రాల చట్టసభల్లో విపక్షాలు పెట్టే అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం తప్పుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటులో లోక్సభ సభ్యులు ఎవరైనా అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చు. అయితే ఈ తీర్మానానికి సభలో కనీసం 50 మంది సభ్యులు మద్దతునివ్వాల్సి ఉంటుంది.
అవిశ్వాస తీర్మానం తప్పనిసరిగా లిఖితపూర్వకంగా ఉండాలి. అలాగే దానిని సిట్టింగ్ ఎంపీ సంతకం చేసి ఇవ్వాలి. లోక్ సభ సమావేశాలు జరుగుతున్నప్పుడు లోక్సభ స్పీకర్కు ఈ తీర్మానాన్ని సమర్పించాలి. అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు అంగీకరించాలా వద్దా అనే విషయాన్ని లోక్సభ స్పీకర్ నిర్ణయిస్తారు. తీర్మానాన్ని ఆమోదించినట్లయితే, స్పీకర్ చర్చకు తేదీ , సమయాన్ని నిర్ణయిస్తారు. లోక్సభ రూల్స్లోని రూల్ 198లోని సబ్-రూల్ (2), (3) కింద తీర్మానంపై చర్చకు స్పీకర్ సమయాన్ని కేటాయించవచ్చు.

లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ తీర్మానంపై చర్చను అవిశ్వాసానికి నోటీసు ఇచ్చిన సభ్యుడే ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై స్పందిస్తుంది. ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలకు ఈ తీర్మానంపై మాట్లాడే అవకాశం ఉంటుంది. చివర్లో ప్రధాని ఈ అవిశ్వాసానికి కారణమైన అంశంపై (ఈసారి మణిపూర్) ప్రకటన చేస్తారు. చర్చ అనంతరం లోక్సభలో విశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది.సభలోని మెజారిటీ సభ్యులు మద్దతు ఇస్తేనే తీర్మానం ఆమోదం పొందుతుంది.
ఇలా పార్లమెంట్ లో విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాలు నెగ్గిన చరిత్ర కూడా ఉంది. పార్లమెంట్ చరిత్రలో ఇప్పటివరకూ మూడు సందర్భాల్లో విపక్షాల అవిశ్వాస తీర్మానాలు గెలిచాయి. దీంతో ప్రభుత్వాలు పడిపోయాయి. ఈసారి మోడీ సర్కార్ పై విపక్షాలు పెడుతున్న అవిశ్వాస తీర్మానం గత 15 ఏళ్లలో మొదటిది. 1990లో వీపీ సింగ్ ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అలాగే 1997లోనూ దేవెగౌడ ప్రభుత్వంపై విపక్షాల అవిశ్వాస తీర్మానం నెగ్గింది. చివరిసారిగా 1999లో వాజ్ పేయ్ ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన తీర్మానం కూడా ఒక్క చోటు తేడాతో నెగ్గింది. దీంతో ఈ మూడు ప్రభుత్వాలు పడిపోయాయి.












Click it and Unblock the Notifications