భారత్ సర్జికల్ స్ట్రయిక్: అంటే ఏమిటి, ఎలా చేస్తారు?
హైదరాబాద్: భారత సైన్యం గురువారంనాడు భారత ప్రజలంతా గర్వపడే పనిచేసింది. బాంబులు కురిపించడం ఆపేసి భారత సైన్యం టెర్రర్ లాంచ్ ప్యాడ్స్పై సర్జికల్ స్ట్రయిక్స్ చేసిందని డిజిఎంఓ లెఫ్టెనెంట్ జనరల్ రణబీర్ సింగ్ చెప్పారు.
దీంతో సర్జికల్ స్ట్రయిక్స్ ఏమిటనే సందేహం రావడం సహజం. పెద్ద యెత్తున విధ్వంసం జరగకుండా నిర్దిష్టమైనదాన్ని విధ్వంసం చేసే వ్యూహంతో సైన్యం చేసే దాడి సర్జికల్ స్ట్రయిక్. ఒక్క నిర్దిష్టమైన స్థలంపై గురి తప్పకుండా సైన్యం దాడి చేయడం సర్జికల్ స్ట్రయిక్లో ఉంటుంది.
తాము ఉద్దేశించిన, దాడికి అర్హమైన దాన్ని మాత్రమే విధ్వంసం చేయడానికి, పరిసరాల్లో నష్టం జరగకుండా చూస్తూ ఉద్దేశిస్తారు. అంటే, పరిసరాల్లోని నిర్మాణాలు, వాహనాలు, భవనాలు, ప్రజల మౌలిక సదుపాయాల వంటివాటికి నష్టం జరగకుండా జాగ్రత్త పడుతారు.
చెప్పాలంటే, మయన్మార్లో చేసిన దాడి ఇటువంటిదే. మయన్మార్లో 70 మంది భారత సైన్యానికి చెందిన కమెండోలు 40 నిమిషాల్లో అపరేషన్ను ముగించారు. ఇందులో 38 మంది నాగా తీవ్రవాదులు హతం కాగా, ఏడుగురు గాయపడ్డారు.
నిర్దిష్టమైన స్థలాలను లక్ష్యం చేసుకుని దాడులు చేయడం కూడా సర్జికల్ స్ట్రయిక్లో భాగం. ఇది కార్పెట్ బాంబింగ్కు విరుద్ధమైంది. కార్పెట్ బాంబింగ్లో పెద్ద యెత్తున విధ్వంసం జరుగుతుంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో పెద్ద యెత్తున నష్టం వాటిల్లుతుంది.
2003 ఇరాక్ యుద్ధ సమయంలో అమెరికా బలగాలు బగ్దాద్పై తొలి విడత వేసిన బాంబుల తీరు సర్జికల్ స్ట్రయిక్స్ కిందికే వస్తాయి. అమెరికా ప్రభుత్వ భవనాలను, మిలిటరీ స్థావరాలను మాత్రమే లక్ష్యం చేసుకుని బాంబులు వేసింది.