సచిన్కు రాజ్యసభలో చేదు అనుభవం: వెంకయ్య, జయ ఆగ్రహం
న్యూఢిల్లీ: తొలిసారి సుదీర్ఘ ప్రసంగం చేసేందుకు సిద్ధమైన ఎంపీ సచిన్ టెండూల్కర్కు రాజ్యసభలో చేదు అనుభవం ఎదురైంది. మైక్ తీసుకుని ప్రసంగించాలని ప్రయత్నించినప్పటికీ.. కాంగ్రెస్ సభ్యుల ఆందోళన మధ్య మాస్టర్ బ్లాస్టర్ తన ప్రసంగాన్ని కొనసాగించలేక విరమించుకున్నారు.
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మన్మోహన్ సింగ్పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు తెలియజేయాలని కాంగ్రెస్ సభ్యుడు డిమాండ్ చేస్తూ నినాదాలతో సభను హోరెత్తించారు. క్రీడల అంశంపై మాట్లాడేందుకు సచిన్ సభలో లేచి నిలుచున్నారు. అయినా.. భారీగా అరుపులు, కేకలు చేస్తూ కాంగ్రెస్ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు.
వెంకయ్య ఆగ్రహం
ఈ నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు జోక్యం చేసుకున్నారు. నినాదాలు చేయవద్దు అంటూ విపక్ష సభ్యులను కోరారు. అయినా వాళ్లు వినిపించుకోలేదు. దీంతో వెంకయ్య ఆగ్రహానికి గురయ్యారు. ‘క్రీడల గురించి మాట్లాడుతుంటే వినరా' అంటూ సభ్యులపై ఆవేశాన్ని వ్యక్తం చేశారు.
సచిన్ మాట్లాడుంటే ఇలానా..?
యువ క్రీడాకారులు సచిన్ను స్ఫూర్తిగా తీసుకుంటారని ఆయన అన్నారు. భారత రత్న అందుకున్న వ్యక్తి క్రీడల గురించి మాట్లాడుతుంటే ఆయన్ను అడ్డుకుంటారా? అంటూ వెంకయ్య సీరియస్ అయ్యారు. అయితే నినాదాలు ఆగకపోవడంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
సచిన్కు ఇలాంటి పరిస్థితా?.. సిగ్గుచేటు
‘ప్రపంచ వేదికపై సచిన్ టెండూల్కర్ ఎంతో పేరు సంపాదించుకున్నారని, మన దేశానికి వన్నెతెచ్చారు. అలాంటి వ్యక్తి సభలో మాట్లాడుతుంటే అడ్డుకోవడం సిగ్గుచేటు. పైగా ఆయన ప్రసంగించబోయే అంశం ఎంత కీలకమైందో ప్రతీ ఒక్కరికీ తెలుసు. సభ ఉన్నది కేవలం రాజకీయ నేతలు మాట్లాడేందుకే కాదు కదా!' అని ఎంపీ జయాబచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సచిన్ ప్రసంగం జరిగివుంటే..
ఒక వేళ రాజ్యసభలో విపక్షాల ఆందోళన లేకుండా, సజావుగా సాగివుంటే.. ‘రైట్ టూ ప్లే అండ్ ఫ్యూఛర్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ ఇండియా 'అనే అంశంపై సచిన్ టెండూల్కర్ సుదీర్ఘంగా ప్రసంగించేవారు. విద్యతోపాటు ఆటలు కూడా తప్పనిసరి చేయాలని.. అందుకు అవసరమైన వసతులను ప్రభుత్వమే కల్పించాలని సచిన్ కోరాలనుకున్నారు. 2012లో సచిన్ టెండూల్కర్ రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే.