జాతీయ పార్టీ కావడమెలా ? టీఆర్ఎస్, టీడీపీ కచ్చితంగా నేర్వాల్సిన పాఠం! ఎందుకంటే ?
కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు, ఇంకా మరికొన్ని పార్టీలు జాతీయ పార్టీలుగా ఎప్పుడు మారాయో తెలిసిన వారు ఈ తరంలో తక్కువే. ముఖ్యంగా నేటి తరం యువతకు జాతీయ పార్టీలుగా మారేందుకు కావాల్సిన అర్హతలు ఆయా పార్టీలు ఎప్పుడు సాధించాయన్నది, ఎలా సాధించాయన్నది తెలియదు. కానీ ఇప్పుడు పదేళ్ల క్రితం లోక్ పాల్ ఉద్యమం నుంచి ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం దశాబ్దం ముగిసేసరికి జాతీయ పార్టీగా మారిపోయింది. అంతే కాదు సొంత రాష్ట్రం దాటి ఏమాత్రం ప్రభావం చూపకపోయినా జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న వారికి పాఠాలు నేర్పే స్ధాయికి ఎదిగింది.

జాతీయ పార్టీ హోదా సాధన
రాష్ట్రాల్లో ప్రాంతీయ ఆకాంక్షలు లేదా ప్రజల్లో సెంటిమెంట్లతో, పలు సమీకరణాలతో ప్రాంతీయ పార్టీలుగా పుట్టిన పలు పార్టీలు ఆ తర్వాత కాలంలో జాతీయ పార్టీలుగా ఆవిర్భవించడం అసహజమేమీ కాదు. కానీ ప్రాంతీయ పార్టీలుగా ఉంటూనే ఇతర రాష్ట్రాల్లో కనీసం పోటీ చేయకపోయినా జాతీయ పార్టీలుగా చెప్పుకుని తిరిగే ఈ రోజుల్లో అసలు ఏది జాతీయ పార్టీ అనే చర్చ కూడా సాగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత హర్యానా, పంజాబ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ వరకూ విస్తరించిన ఆమ్ ఆద్మీ పార్టీ .. ఇప్పుడు అచ్చమైన జాతీయ పార్టీగా ఆవిర్భవించింది. అంతే కాదు దేశంలో పలు ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలుగా మారడమెలాగో పాఠాలు నేర్పుతోంది.

జాతీయపార్టీగా మారిన ఆప్
పదేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా లోక్ పాల్ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఎందరో ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు అందులో చేరారు. అందులో ఒకరైన మాజీ ఐఆర్ఎస్ అధికారి అరవింద్ కేజ్రివాల్ తనకున్న రాజకీయ ఆకాంక్షతో ఆమ్ ఆద్మీ పార్టీని ప్రారంభించారు. జనంలోకి వెళ్లి సిసలైన రాజకీయాన్ని పరిచయం చేయడం మొదలుపెట్టారు. విద్యావంతులు ఎక్కువగా ఉండే ఢిల్లీ నుంచి మొదలుపెట్టిన ఈ రాజకీయం ఇప్పుడు హర్యానా, పంజాబ్, గోవా, గుజరాత్, హిమాచల్ వరకూ చేరిపోయింది. అంతే కాదు ఢిల్లీతో పాటు పంజాబ్ లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసే స్దాయికి వెళ్లింది. మిగతా రాష్ట్రాల్లోనూ కనీస ఓట్లు కురిపించింది. దీంతో ఇప్పుడు ఆప్ సగర్వంగా జాతీయ పార్టీగా ఆవిర్బవించబోతోంది.

కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ
తెలంగాణ సాధన కోసం రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ రెండుసార్లు అధికారం అందించినా, హ్యాట్రిక్ సాధన సమయంలో బీజేపీ నుంచి పెనుసవాళ్లు ఎదుర్కొంటోంది. దీంతో బీజేపీని రాష్ట్రంలో అడ్డుకోవడం ఎలాగో తెలుసుకుకోవడంలో విఫలమైన కేసీఆర్.. జాతీయ స్ధాయిలో ఆ పార్టీ విధానాల్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అంతే కాదు బీజేపీని ఎదుర్కోవాలంటే తన పార్టీ టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చాలనుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ జాతీయ పార్టీ కావాలంటే ఇతర రాష్ట్రాల్లోనూ సీట్లు, ఓట్లతో ప్రభావం చూపితే సరిపోతుంది. కానీ కేసీఆర్ కు అంత ఓపిక ఉన్నట్లు లేదు. దీంతో వెంటనే తన టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ అంటూ బీఆర్ఎస్ గా మార్చేశారు. దానికి బదులుగా కేజ్రివాల్ తరహాలోనే కాస్త ఓపిక పట్టి ఇతర రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రయత్నిస్తే సరిపోయేది. ఇప్పటికీ పొరుగు రాష్ట్రం ఏపీలో కాలుమోపని కేసీఆర్ తన పార్టీని జాతీయ పార్టీగా చెప్పుకునేందుకు అర్హత ఉందా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

చంద్రబాబు టీడీపీ
కేసీఆర్ కంటే ముందు తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా చెప్పుకుని తిరుగుతున్న నేతల్లో చంద్రబాబు కూడా ఒకరు. ఏపీ విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉనికి ఉందన్న కారణంతో జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న టీడీపీకి చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అలాగే ఆయన తనయుడు నారా లోకేష్ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. కానీ జాతీయ స్ధాయిలో అంతెందుకు పొరుగు రాష్ట్రాల్లో చంద్రబాబు పార్టీ టీడీపీ ఉనికి కాపాడుకునేందుకు సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. కేవలం తెలంగాణలో మాత్రమే ఎన్నికల సమయంలో హంగామా చేయడం ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం టీడీపీ జాతీయ పార్టీ ప్రచారానికి ఏమాత్రం ఉపయోగపడటం లేదు. అయితే కేసీఆర్ తో పోలిస్తే పొరుగు రాష్ట్రంలో కనీస ఓటుబ్యాంకు కలిగి ఉండటం, పర్యటనలు చేయడం ద్వారా చంద్రబాబు కాస్త మెరుగ్గా కనిపిస్తున్నారు.

కేజ్రివాల్ నేర్పుతున్న పాఠాలు !
పదేళ్ల క్రితం ఢిల్లీలో అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలో ఓ చిన్న పార్టీగా ఆవిర్భవించిన ఆప్ ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు చేయని ప్రయత్నం లేదు. ముఖ్యంగా దేశంలో కాంగ్రెస్ పతనంతో తలెత్తుతున్న రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు ఆప్ వేగంగా అడుగులు వేసింది. జనం కూడా ఈ ప్రస్దానాన్ని ఆదరించారు. కేజ్రివాల్ పోరాటాన్ని నమ్మారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో ఒక్కొక్కటిగా స్దానిక అజెండాల ఆధారంగా ఆప్ దూసుకెళ్లింది. చివరకు కనీసం ఆరు రాష్ట్రాల్లో ఉనికి చాటుకుంటున్న ఆప్ జాతీయ పార్టీ కావడానికి అన్ని అర్హతలు సాధించింది. కానీ తెలుగు రాష్ట్రాల్లోని టీఆర్ఎస్, టీడీపీ వంటి పార్టీలు మాత్రం జాతీయ పార్టీలుగా చెప్పుకుంటూ తమను తాము మోసం చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా ఇతర రాష్ట్రాల్లో సత్తా చాటుకోవడం ద్వారా జాతీయ పార్టీలుగా ఎదిగేందుకు
కేజ్రివాల్ ను స్ఫూర్తిగా తీసుకుని కేసీఆర్, చంద్రబాబు ప్రయత్నాలు చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications