Omicron వణుకు: కొత్త మార్గదర్శకాలు ఇవే.. రిస్క్ దేశాల నుంచి వచ్చేవారు ముందే
ఒమిక్రాన్ బెంబేలెత్తిస్తోంది. బ్రిటన్లో తొలి మరణం నమోదు కాగా.. మరిన్ని మరణాలు సంభవిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్ చేసింది. దీంతో రిస్క్ ఎక్కువ ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రపంచ దేశాలు దృష్టిసారించాయి. భారతదేశం కూడా కొత్తగా మార్గదర్శాలను రూపొందించింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలకు కోవిడ్ రిస్క్ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు తప్పనిసరిగా RT-PCR పరీక్షను ముందుగానే బుక్ చేసుకోవాలని సూచించింది. కొత్త గైడ్లైన్స్ ఈ నెల 20వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్.. చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా రాజస్థాన్లో 1 కొత్త కేసు, దేశ రాజధాని ఢిల్లీలో మరో నాలుగు కేసులతో కలిపి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 49కి పెరిగాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధికంగా 20 కేసులు నమోదు కాగా, రాజస్థాన్లో 13, కర్ణాటకలో 3, గుజరాత్లో 4, కేరళ, ఆంధ్రప్రదేశ్లో ఒక్క కేసు బయటపడింది. దేశ రాజధాని ఢిల్లీలో 6, చండీగఢ్ ఒక కేసులు వచ్చాయి. రాజస్థాన్లో ఇవాళ ఒక్కరోజే కోవిడ్-19 ఓమిక్రాన్ వేరియంట్ నాలుగు కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
బ్రిటన్లో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించడంతో ప్రపంచం మరింత వణుకుతోంది. ఇన్నాళ్లు ఒమిక్రాన్ బయటపడిన సీరియస్ లక్షణాలు లేవని వైద్య నిపుణులు చెప్పారు. కానీ మరణం నమోదు కావడంతో ఆందోళన నెలకొంది. మార్చి- ఏప్రిల్ వరకు పరిస్థితి ఘోరంగా ఉంటుందని డబ్య్లూహెచ్వో తెలుపడం మరింత ఆందోళన కలిగిస్తోంది. దీంతో అంతా మాస్క్ ధరించి.. ఫిజికల్ డిస్టన్స్ పాటించాలని నిపుణులు కోరుతున్నారు. ఇప్పటివరకు టీకా తీసుకోని వారు కూడా విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని మరీ మరీ చెబుతున్నారు.
ఒమిక్రాన్ వైరస్ టెన్షన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ గడ గడలాడించిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ దేశంలో మూడో వేవ్ అనడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అందరూ పైకి గంభీరంగా ఉన్నా.. లోన మాత్రం భయపడుతూనే ఉన్నారు.