'భారత రత్నం' నానాజీ దేశ్ముఖ్: ఎవరీ వ్యక్తి.. ఆయన దేశానికి అందించిన సేవలేంటి..?
అది అక్టోబర్ 11, 1916, మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో ఉన్న కడోలి అనే గ్రామం. ఆ గ్రామంలో ఆ రోజు పుట్టిన బిడ్డ ఏదో ఒకరోజు దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తిగా అవుతారని ఆ గ్రామస్తులు భావించి ఉండరు. అసలు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న ఆ పిల్లాడిని వరిస్తుందని ఎవరూ అనుకోని ఉండరు. కానీ ఆ వ్యక్తి చేసిన సేవలకుగాను భారతరత్న వరించింది. ఇంకీ ఆ వ్యక్తి ఎవరు... దేశానికి ఆయన చేసిన సేవలు ఎలాంటివి తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.
నానాజీ మరణాంతరం వరించిన భారత రత్న పురస్కారం
నానాజీ దేశ్ముఖ్.... 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న గ్రహీత. సామాజిక కార్యకర్తగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సుదీర్ఘ కార్యకర్తగా.. జయప్రకాష్ నారాయణ్ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన వ్యక్తి నానాజీ దేశ్ ముఖ్. అప్పటికీ భారతదేశానికి స్వాతంత్ర్యం లభించలేదు. భారత్కు స్వాతంత్ర్యం సిద్ధించేందుకు ఆ నాటి నుంచి 31 ఏళ్లు పట్టింది. నానాజీ పుట్టిన 103 ఏళ్లకు ఆయన్ను భారతరత్న వరించింది. అయితే ఈ ఆనందాన్ని చూసేందుకు ఆయన లేరు. భారతరత్న పురస్కారం నానాజీ మరణాంతరం ఆయన్ను వరించింది.
విరిసిన పద్మాలు, 112 మందికి అవార్డులు: నలుగురు తెలుగు ప్రముఖులకు పద్మశ్రీలు
13 ఏళ్ల వయస్సులోనే ఆర్ఎస్ఎస్లో చేరిన నానాజీ
నానాజీ దేశ్ముఖ్ 13 ఏళ్ల వయసు సమయంలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్లో చేరారు. 1926లో హిందువులపై జరిగిన హింసలో ఆర్ఎస్ఎస్ ఎలా వారిని కాపాడిందో దగ్గరుండి చూసి అందుకు ముగ్ధుడినై ఆర్ఎస్ఎస్లో తాను చేరినట్లు 1996 ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నానాజీ చెప్పారు. ఆనాడు బ్రిటీషు రాజ్యంలో ఉన్న దేశ్ముఖ్ భారత్కు స్వాతంత్ర్యం సిద్దించాలంటే అది ఆర్ఎస్ఎస్ వల్లే అవుతుందని బలంగా నమ్మారు. ఆర్ఎస్ఎస్లో తను భాగస్వామి కాకపోయి ఉంటే దేశం గురించి తెలిసేది కాదని తన జీవితాన్ని దేశం కోసం ధారపోసేవాడిని కానని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆర్ఎస్ఎస్ లేకుంటే నానాజీ లేరని ఆయన మరో ఇంటర్వ్యూలో చెప్పారు.
హిందూ - ముస్లిం సంబంధాలపై నానాజీ
నానాజీ సుదీర్ఘకాలంగా ఆర్ఎస్ఎస్తో ఉన్నారు. జనసంఘ్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. ఒకానొక సందర్భంలో నానాజీని ఒక విలేఖరి ఇలా అడిగారు. దేశంలోని హిందూ ముస్లింల సంబంధాలపై తన అభిప్రాయం ఏమిటని. " సామాజిక అభ్యున్నతి, హిందూ దేశం అనేది మీ అజెండాగా ఉండగా.. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ముస్లింలకు వ్యతిరేకం కదా" అని విలేఖరి ప్రశ్నించారు. ఇందుకు "దేశంలో హిందు-ముస్లింల సమస్య లేదని చెప్పారు. హిందువులు ముస్లింల మధ్య చిచ్చు పెట్టిందే రాజకీయనాయకులు" అని అన్నారు. అందుకే తాను రాజకీయాలకు స్వస్తి పలికినట్లు వెల్లడించారు.
జేపీ ఉద్యమంలో కీలకంగా మారిన నానాజీ
ప్రముఖ సామాజిక కార్యకర్త స్వాతంత్ర సమరయోధుడు జయప్రకాష్ నారాయణ్ నాడు ఇందిరా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమంలో నానాజీ కీలక పాత్ర పోషించారు. లోక్సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శిగా నానాజీ దేశ్ముఖ్ జయప్రకాష్ నారాయణ్కు కుడిభుజంగా ఉండి పనిచేశారు. 1975 జూలై 29న జరిగిన పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో నానాజీ దేశ్ముఖ్ను అరెస్టు చేయడం జరిగింది. అంతకుముందుఎమర్జెన్సీ సమయంలో సుబ్రహ్మణియన్ స్వామి, ఎంఎల్ ఖురానా, రవీంద్రవర్మ, దత్తోపంత్ తెంగడి లాంటి నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలని సూచించారు. దీనికి ఆపరేషన్ టేక్ఓవర్ అని పేరు పెట్టి పలు రాష్ట్ర రాజధానుల్లో ఆయన పర్యటించారు. ఆ తర్వాత జూలై 29,1975లో నానాజీని పోలీసులు అరెస్టు చేశారు. జైల్లో 17 నెలల పాటు గడిపిన నానాజీ... అతని మిత్రుడు ప్రముఖ జాతీయపత్రిక అధినేత రామ్నాథ్ గోయెంకా తన విడుదలకు ఇందిరాగాంధీతో చర్చలు జరిపి సక్సెస్ అయ్యారని చెప్పారు. 1977లో తను ఎన్నికల్లో నిలబడాల్సిందిగా రామ్నాత్ గోయెంకా సలహా ఇచ్చినట్లు వెల్లడించారు నానాజీ.
నానాజీ రాజకీయ జీవితం
జైలు నుంచి విడుదలైన నానాజీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఉత్తర్ప్రదేశ్లోని బలరామ్పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఈ క్రమంలోనే జనతాపార్టీలోకి జన్సంఘ్ విలీనం కావడంలో కీలక పాత్ర పోషించారు నానాజీ. అయితే మొరార్జీ దేశాయ్ కేబినెట్లో మంత్రిగా చేరేందుకు మాత్రం విముఖత చూపారు. కొన్ని రోజులకు రాజకీయ జీవితానికి స్వస్తి పలికిన నానాజీ సామాజిక సేవకుడిగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో రాజకీయాలకు ఎందుకు స్వస్తి పలికారని ఆయన్ను అడగ్గా... మనం ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నామనే సమాధానం ఇచ్చారు. భారత్ అసలైన ఆస్తిపాస్తులు ప్రజల్లో సహజవనరుల రూపంలో గ్రామాల్లో దాగి ఉందని అభిప్రాయపడ్డారు. దీన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని అన్నారు. కేవలం నగరాలను మాత్రమే అభివృద్ధి చేస్తూ దేశానికి పట్టుకొమ్మల్లాంటి గ్రామాలను విస్మరిస్తోందని ధ్వజమెత్తారు. రాజకీయనాయకులతో విసిగి వేశారి పోయానని చెప్పిన నానాజీ... రాజకీయాలకు స్వస్తి పలికి యువతతో గ్రామాలను అభివృద్ధి చేసేందుకు పాటుపడతానని వెల్లడించారు. నానాజీ దేశ్ముఖ్ తన 95 ఏళ్ల వయస్సులో ఫిబ్రవరి 27 , 2010లో కన్నుమూశారు.