Mansukh Mandaviya : ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయనే ఎందుకు... అసలు కారణం ఇదీ...
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆరోగ్యశాఖ మంత్రిగా హర్షవర్ధన్ స్థానంలో రాజ్యసభ ఎంపీ మన్సుఖ్ మాండవియా నియమితులయ్యారు. ఇంతకుముందు కేంద్ర పోర్టులు,షిప్పింగ్ శాఖ సహాయమంత్రిగా పనిచేసిన ఆయనకు తాజాగా కేంద్ర కేబినెట్ బెర్త్ దక్కింది. కరోనా సెకండ్ వేవ్ను ఎదుర్కోవడంలో కేంద్రం వైఫల్యం చెందిందన్న విమర్శల నేపథ్యంలో హర్షవర్ధన్ కేబినెట్ నుంచి ఔట్ అవగా... ఇప్పుడా కీలక స్థానాన్ని మన్సుఖ్ మాండవియాతో భర్తీ చేశారు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా మాండవియా బాధ్యతలు చేపట్టనుండటంతో చాలామంది ఆయన నేపథ్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఎవరీ మన్సుఖ్ మాండవియా...
గుజరాత్లోని సౌరాష్ట్ర పరిధిలో ఉన్న భావ్నగర్ జిల్లాలోని హనోల్ అనే చిన్న గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో మాండవియా జన్మించారు. 2002లో కేవలం 28 సంవత్సరాల వయసులోనే మాండవియా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జంతువుల పట్ల ఉన్న ప్రేమ కారణంగా ఆయన గుజరాత్ అగ్రికల్చర్ యూనివర్సిటీ-దంతివాడ నుంచి వెటర్నరీ సైన్స్లో డిగ్రీ పూర్తి చేశారు. ఆపై పొలిటికల్ సైన్స్లో పీజీ పూర్తి చేశారు.
పాదయాత్రలకు పెట్టింది పేరు...
మన్సుఖ్ మాండవియా పేరు వినగానే పాదయాత్రలు గుర్తుకొస్తాయి. 2005లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విద్యపరంగా వెనుకబడిన 45 గ్రామీణ ప్రాంతాల్లో 123కి.మీ మేర పాదయాత్ర చేశారు.ఆయా గ్రామాల్లోని బాలికలకు చదువు పట్ల అవగాహన కల్పించి వారిని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేశారు. 2007లో 'బేటీ బచావో.. బేటీ పడావో' 'వ్యసన్ హఠావో' నినాదాలతో 52 గ్రామాల్లో 127కి.మీ మేర పాదయాత్ర చేశారు. 2019లో మహాత్మాగాంధీ భావజాలన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దాదాపు వారం పాటు 150 గ్రామాల్లో 150కి.మీ మేర పాదయాత్ర చేశారు.
Recommended Video
అందుకే ఈ పదవి కట్టబెట్టారా...
కేంద్ర రసాయనాలు,ఫార్మాసూటికల్స్ సహాయమంత్రిగా ప్రధానమంత్రి జన ఔషధి ప్రయోజన కార్యక్రమాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు మన్సుఖ్ మాండవియా చాలా కృషి చేశారు. ఈ క్రమంలో 5200 జన్ ఔషధి కేంద్రాల ద్వారా సబ్సిడీపై ప్రజలకు మందులు అందజేశారు. అలాగే దాదాపు 10 కోట్ల సువిధ శానిటరీ ప్యాడ్ ప్యాకెట్లను కేవలం రూ.10కే మహిళలకు అందజేశారు. ఇందుకు గాను 2019లో ప్రతిష్ఠాత్మక యునిసెఫ్ అవార్డు ఆయన్ను వరించింది. ప్రజా సమస్యలపై పట్టింపు ఉన్న నేత కావడం... జనంలోకి వెళ్లి మమేకమయ్యే లక్షణాలు ఉండటం... ఈ కారణంగానే కేంద్ర ఆరోగ్యశాఖను మాండవియాకు కట్టబెట్టినట్లుగా కనిపిస్తోంది. మున్ముందు కరోనా రూపంలో మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉండటంతో మాండవియా ఆ పరిస్థితులను సమర్థవంతంగా డీల్ చేయగలరని కేంద్రం భావించినట్లు తెలుస్తోంది.