జామియా మిలియా ఘటనపై మౌనం వీడిన రాహుల్ గాంధీ, గోపాల్ వెనక ఉన్నది ఎవరని ప్రశ్న
జామియా మిలియా ఇస్లామియా వర్సిటీలో జరిపిన కాల్పులపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు గురువారం ఆందోళన చేపట్టారు. రైట్ వింగ్కు చెందిన గోపాల్ అనే వ్యక్తి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఇంతకీ గోపాల్ ఎవరు..? అతని వెనక ఎవరు ఉన్నారు అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
నేపథ్యం ఏంటీ..?
సీఏఏను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం జామియా మిలియా వర్సిటీలో కూడా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇంతలో అక్కడికొచ్చిన గోపాల్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో షాదాబ్ ఫారూఖ్ అనే విద్యార్థి గాయపడ్డారు. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మౌనం వీడారు. ఇంతకీ గోపాల్ ఎవరు అని ప్రశ్నించారు. అతనికి హిందు సంస్థలతో సంబంధం లేదా అని అడిగారు.
ప్రోద్బలం
జామియా మిలియా వర్సిటీలో ఆందోళన చేస్తోన్న విద్యార్థులపై కాల్పులు జరపాలని ఎవరు ఊసిగొల్పారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దీనిపై సమగ్రమైన విచారణ జరపాలని కోరారు. దీంతో నిజనిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అతివాద సంస్థల ప్రోద్బలంతోనే గోపాల్ కాల్పులకు తెగబడి ఉంటారని రాహుల్ గాంధీ అనుమానం వ్యక్తం చేశారు. జామియా ఘటనపై స్పందించాలని రాహుల్ గాంధీని మీడియా ప్రతినిధులు అడగగా.. గోపాల్ వెనక ఎవరు ఉన్నారని ప్రశ్నించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాహుల్ గాంధీ పార్లమెంట్కు వస్తోన్న సమయంలో మీడియా ప్రతినిధులు రాహుల్ వివరణ కోరగా.. ఈ హాట్ కామెంట్స్ చేశారు.
స్థిమితంగానే..
మరోవైపు జామియా మిలియా వర్సిటీలో గాయపడ్డ విద్యార్థి షాదాబ్ ఫరూక్ ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉంది. అతనికి ఎయిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చేతికి బుల్లెట్ తగలడంతో ఆపరేషన్ చేసినట్టు వైద్యులు తెలిపారు. ఇదిలాఉంటే మరోవైపు కాల్పులు జరిపిన గోపాల్ను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు ప్రవేశపెట్టనున్నారు.