పకోడా కౌంటర్: 2కోట్ల పకోడాలు చేస్తే అవి ఎవరు తింటారు..మోడీకి తేజస్వీ యాదవ్ ప్రశ్న
ఢిల్లీ: పకోడాలు అమ్ముకోవడం కూడా ఒక రకమైన ఉద్యోగమేనన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వియాదవ్ ఘాటుగా విమర్శించారు. ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధాని హామీ ఏమైందని ప్రశ్నించారు. రెండుకోట్ల మంది నిరుద్యోగులు పకోడాలు వేస్తే వాటిని ఎవరు తింటారని ఎద్దేవా చేశారు. నల్లధనం వెనక్కు తీసుకొస్తమన్నారు... ప్రతి బ్యాంక్ అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రధానిని ప్రశ్నించారు తేజస్వియాదవ్.
ఐఆర్సీటీసీ కేసులో తేజస్వి యాదవ్కు బెయిల్
ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని ఇప్పుడేమో పకోడాలు చేసుకోమంటున్నారని మండిపడ్డారు తేజస్వీ యాదవ్. ప్రతి బ్యాంక్ అకౌంటులోకి రూ.15 లక్షలు జమచేస్తామన్న ప్రధాని అందులోనుంచి కనీసం రూ.1 నుంచి 2 లక్షలైనా వేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు బీజేపీ మరో 50 ఏళ్లు దేశాన్ని పరిపాలిస్తుందన్న అమిత్ షా వ్యాఖ్యలపై కూడా తేజస్వి స్పందించారు. ఇలాగైతే దేశంలో ఎన్నికలు ఎందుకని ఆయన అన్నారు. విపక్షాలన్నీ ఏకమై బీజేపీని తరిమికొట్టి దేశాన్ని నియంత పాలన నుంచి కాపాడుకుంటామని తేజస్వి అన్నారు. రిజర్వేషన్లను బీజేపీ ఎత్తివేయాలని చూస్తోందని... మోడీ మరోసారి ఎన్నుకోబడితే ఇకపై దేశంలో ఎన్నికలు కూడా ఉండవని విమర్శించారు తేజస్వీ యాదవ్.
నితీష్ కుమార్ తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్కు నమ్మకద్రోహం చేశారని మరోసారి మండిపడ్డారు తేజస్వీ యాదవ్. నితీష్ కుమార్ తన తప్పును తెలుసుకున్నారని భావించామని తనకే మళ్లీ మద్దతు తెలుపుదామనుకున్న సమయంలో తిరిగి బీజేపీ చెంతకు చేరారని తేజస్వీయాదవ్ ఆరోపించారు. ఇకపై నితీష్ పార్టీ జనతాదల్ యునైటెడ్ పార్టీతో జతకట్టేది లేదన్న తేజస్వీ యాదవ్... నితీష్ కుమార్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. నాలుగేళ్లలో నాలుగు ప్రభుత్వాలు బీహార్లో వచ్చాయని, ప్రజలకంటే తన ముఖ్యమంత్రి కుర్చీ అంటేనే నితీష్కుమార్కు ముఖ్యమని ధ్వజమెత్తారు తేజస్వీ యాదవ్. మళ్లీ తనతో ఎలా వెళతామని ప్రశ్నించారు. లాలూ ప్రసాద్ యాదవ్ పై కేసులు పెట్టినప్పటికీ.. నితీష్కే మద్దతు పలికారని గుర్తుచేసిన తేజస్వి తన తండ్రంత మంచి మనకు తనకు లేదన్నారు. మరోవైపు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం శుభపరిణామం అన్న తేజస్వీ యాదవ్... ఇంకా చాలమంది రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.