Delhi Polls: ఢిల్లీలో మారుతున్న లెక్కలు-ఆప్, బీజేపీల్లో గెలిచేదెవరో తేల్చేసిన సర్వే..!
ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే నెల 5న జరిగే ఎన్నికలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. దీనికి కారణం వరుసగా మూడుసార్లు గెలిచి అధికారంలో ఉన్న కేజ్రివాల్ పార్టీ ఆప్ ను వరుసగా కేంద్రంలో మూడోసారి గెలిచిన బీజేపీ నిలువరించగలదా లేదా అన్న చర్చ. అయితే ఢిల్లీలో ఈసారి ఎన్నికల ఫలితాలు అందరి అంచనాల్ని తలకిందులు చేసేలా ఉంటాయన్న మరో వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ మార్కెట్ ఫలోడీ సత్తా బజార్ ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై తమ అంచనాల్ని సవరించింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ అధికార ఆప్, విపక్ష బీజేపీ మధ్యే నెలకొంది. మూడో పక్షంగా ఉన్న కాంగ్రెస్ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిస్ధితుల్లో ప్రధాన పోటీదారులైన ఆప్, బీజేపీ గెలుపు కోసం సర్వశక్తులొడ్డుతున్నాయి. ముఖ్యంగా పేద, మధ్య తరగతి వర్గాల్ని టార్గెట్ చేస్తూ ఇరు పార్టీలు మ్యానిఫెస్టో హామీలు ఇచ్చాయి. ఈసారి అభివృద్ధి, ఇతర అంశాల కంటే ఉచిత పథకాల హామీలనే ఇరు పార్టీలు నమ్ముకున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో ఢిల్లీ ఓటరు ఎవరిని కరుణించబోతున్నాడనే అంశంపై ఫలోడీ సత్తా బజార్ గతంలో వేసిన లెక్కల్ని తాజాగా సవరించుకుంది.

ఇప్పటి వరకు వెలువడిన పలు ఒపీనియన్ పోల్లు అధికార ఆప్ కు ఆధిక్యం ఇచ్చాయి. ఇదే క్రమంలో రాజస్థాన్లోని ఫలోడిలో ఉన్న ఫలోడి సత్తా బజార్ బెట్టింగ్ మార్కెట్ కూడా ఆప్ కు 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో 36 సీట్లు వస్తాయని గతంలో అంచనా వేసింది. ఆ తర్వాత దీన్ని 37-39కి సవరించింది. తాజా అంచనా ప్రకారం ఆప్ 39 నుంచి 41 సీట్లు గెలుచుకుంటుందని ఫలోడీ సత్తా బజార్ అంచనా వేసింది. దీన్ని బట్టి ఆప్ కు సీట్ల సంఖ్య తగ్గినా అధికారం మాత్రం ఖాయమని తేల్చిసింది.
ఫలోడీ సత్తా బజార్ అంచనాలతో లోక్ సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బల తర్వాత మహారాష్ట్ర, హర్యానాలో గెలిచి ఉత్సాహంగా ఉన్న బీజేపీకి హస్తినలో మరోసారి భంగపాటు తప్పదని తేలిపోతోంది. ఫలోడి సత్తా బజార్ తాజా సవరించిన అంచనాల ప్రకారం బీజేపీ 29 నుండి 31 సీట్లు గెల్చుకునే అవకాశాలున్నాయి. ఇది మెజారిటీ మార్క్ అయిన 36 కంటే 5-6 సీట్లు తక్కువే. అలాగే కాంగ్రెస్ పార్టీకి మూడు సీట్లు దక్కవచ్చని అంచనా వేస్తోంది. ఢిల్లీలో 70 స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.












Click it and Unblock the Notifications