కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలు ఇలా, ముఖ్యమంత్రిగా తెరపైకి ఎందరో?
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ ఎగ్జిట్ పోల్ సర్వేలు హంగ్ వస్తుందని తేల్చాయి. కొన్ని సర్వేలు మాత్రం బీజేపీ మెజార్టీ సాధిస్తుందని చెప్పగా, కొన్ని కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాయి. అయితే, హంగ్ వస్తే జేడీఎస్ చక్రం తిప్పుతుందా అనే ఆసక్తి అందరిలోను నెలకొంది.
Recommended Video


అందుకే తెరపైకి ఈ వాదన
కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు రాకుంటే జేడీఎస్ మద్దతిచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందుకే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ నేతలు దళిత సీఎం అంశాన్ని తెరపైకి తెచ్చారు. అదే జరిగితే మల్లికార్జున ఖర్గే, పరమేశ్వరలు తెరపైకి వస్తారు. దళిత సీఎం నేపథ్యంలో జేడీఎస్ బీజేపీకి కాకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే అవకాశాలు పెరుగుతాయి.

అదే జరిగితే కాంగ్రెస్కు కొత్త ఉత్సాహం
కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధిస్తే రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీ మరింత పటిష్టమవుతుంది. 2019 ఎన్నికలకు ఆ పార్టీలో ఇవి నూతన ఉత్తేజాన్ని నింపుతాయి. అంతేకాదు, త్వరలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుంది.

మోడీ-అమిత్ షాలకు తిరుగులేదు
బీజేపీకి మెజార్టీ వస్తే నరేంద్ర మోడీ - అమిత్ షాల ద్వయంకు తిరుగులేదని మరోసారి తేలిపోతుంది. బీజేపీ మెజార్టీ సాధించకుండా అతిపెద్ద పార్టీగా అవతరిస్తే.. జేడీఎస్ మద్దతు అవసరమైతే యడ్యూరప్ప కాకుండా అనంత్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే, జేడీఎస్ నేత కుమారస్వామి ఉపముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయి.

కాంగ్రెస్ -బీజేపీ పోటాపోటీగా ఉంటే
కాంగ్రెస్ - బీజేపీల సీట్లు పోటాపోటీగా ఉంటే జేడీఎస్ మద్దతు కచ్చితంగా అవసరం పడుతుంది. అప్పుడు రాజకీయ, సామాజిక కోణాల్లో ఆలోచించి జెడీఎస్ ముందుకు సాగుతుంది. ఇరు పార్టీలు ఆ పార్టీని తమ వైపు లాక్కునేందుకు ప్రయత్నిస్తాయి. అప్పుడు జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుంది. సందర్భాన్ని బట్టి కింగ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక, ఏ పార్టీకి అయినా 105కు పైగా సీట్లు వస్తే జేడీఎస్ మద్దతు లేకుండా స్వతంత్రులతోను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కొట్టి పారేయలేం. కాంగ్రెస్లో సీఎం అభ్యర్థులు ఐదుగురు ఉన్నారు. దళిత నేత అయితే పరమేశ్వర, మల్లికార్జున ఖర్గే. వక్కళిగ నేత అయితే డీకే శివ కుమార్. లింగాయత్ అయితే ఎంబీ పాటిల్. సంపూర్ణ మెజార్టీ ఉంటే మాత్రం సిద్ధరామయ్య.

2019 భవిష్యత్తు
కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధిస్తే బీజేపీ విజయబావుటాకు అడ్డుకట్ట పడిందని తేలిపోతుందని అంటున్నారు. ఒకవేళ బీజేపీ గెలిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టమే. 2014 నుంచి ఆ పార్టీ ఎక్కడా సత్తా చాటలేకపోతుంది. ఇప్పుడు కూడా ఓడితే ఆ పార్టీ జీర్ణించుకోలేని విషయమే అవుతుంది. ఏ పార్టీ ఓడినా ఆ పార్టీకి 2019లో ఇబ్బందికరమేననేది భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications