ఏ మతం వారైనా సీఎం కావొచ్చు: 'హిందూ'పై బీజేపీ
హిందువే తదుపరి జమ్మూ కాశ్మీర్ సీఎం కావాలన్న కాంగ్రెస్ నేత శ్యామ్లాల్ శర్మ డిమాండ్పై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు త్వరలో జరిగే జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లోనూ అధికారం తమదేనని పార్టీ ఎంపీ, రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి అవినాశ్ రాయ్ ఖన్నా ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికలకు ముందు ఏ పార్టీతో పొత్తు కూడా ఉండదన్నారు. అవినీతి రహిత పాలనే తమ ఎన్నికల నినాదమన్నారు. వరదల తర్వాత కశ్మీర్ లోయలో చేపటట్టిన సహాయ, పునరావాస చర్యలతో ముస్లింలు సైతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అభినందిస్తున్నారని ఖన్నా చెప్పారు.
మరోవైపు, పీడీపీ కూడా ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసింది. తమ జీవితాల్లో మార్పు కోసం పీడీపీకి అధికారం కట్టబెట్టేందుకు ఓటర్లు ఓటును ఒక సాధనంగా చేసుకోవాలని ఇటీవలే పీడీపీలో చేరిన కాశ్మీర్ రాజ కుటుంబానికి చెందిన విక్రమాదిత్య సింగ్ పిలుపు ఇచ్చారు. విక్రమాదిత్య కాంగ్రెస్ నేత డాక్టర్ కరణ్ సింగ్ కుమారుడు. నవంబర్ 25 నుంచి ఐదు దశల్లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.
ఇదిలా ఉండగా, కాశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి ప్రస్తావించబోయిన పాకిస్థాన్కు శృంగభంగం ఎదురయ్యింది. లండన్ వేదికగా కాశ్మీర్పై చర్చ జరిపేందుకు యూకేలోని పాక్ అనుకూల గ్రూప్ చేసిన ప్రయత్నం రసాభాసగా మారింది. అంతేకాదు, ఈ వైఫల్యానికి నువ్వంటే నువ్వు కారణమని పాకిస్థాన్లోని పీపీపీ నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ, ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ వర్గీయులు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు.
లండన్లో ట్రఫల్గర్ స్క్వేర్ నుంచి డౌనింగ్ స్ట్రీట్ వరకు ఆదివారం మిలియన్ మార్చ్కు బారిస్టర్ సుల్తాన్ మహమూద్ చౌదరి నాయకత్వంలోని ఒక సంస్థ పిలుపునిచ్చింది. బిలావల్ భుట్టో మాట్లాడేందుకు ప్రయత్నించగానే జనాలు నిరసనగా అరుస్తూ ఖాళీ ప్లాస్టిక్ బాటిల్స్ వేదికపై విసిరి కొట్టారు.
గో బిలావల్.. గో బిలావల్.. అంటూ మాట్లాడనీయకుండా చేశారు. ఇమ్రాన్ఖాన్ మేనల్లుడు హసన్ నియాజీ ఈ ఘర్షణలో పాల్గొన్నట్టు భావించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ప్రభావం పాకిస్థాన్లో కనిపించింది. పీపీపీ, ఇమ్రాన్ పార్టీల మధ్య ఘర్షణలు ఇంకా తీవ్రతరమయ్యాయి. కాశ్మీర్లోని ప్రజల సంక్షేమం కోసం తలపెట్టిన ఈ మార్చ్తో బిలావల్కు ఏం సంబంధమని ఆందోళనకారులు ప్రశ్నించారు.
భారత్, బ్రిటన్ మధ్య ఉన్న సత్సంబంధాలను చెడగొట్టేందుకు కొన్ని శక్తులు ఈ మార్చ్ను ఒక సాకుగా వాడుకోవచ్చని భారత్ హెచ్చరించింది. ఈ మిలియన్ మార్చ్ విఫలమయ్యేలా చేయాలంటూ భారత్ పరోక్షంగా బ్రిటన్పై ఒత్తిడి తెచ్చింది. కశ్మీర్ వివాదాన్ని ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవల్సి ఉంటుందని బ్రిటన్ ప్రకటించడంతో ఇండియా ఊపిరిపీల్చుకుంది.