ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదు?: కేంద్రంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి,
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి అవసరమైన ఆక్సిజన్ను అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవడంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీకి కేటాయించిన మెడికల్ ఆక్సిజన్ను అందించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కూడా పాటించకపోవడం పట్ల ఉన్నత న్యాయస్థానం అధికారులపై మండిపడింది. ఈ సమయంలో కోర్టు ధిక్కరణ చర్యలకు ఎందుకు ఉపక్రమించకూడదని ప్రశ్నించింది.
అంతేగాక, కేంద్ర ప్రభుత్వానికి షోకాజు నోటీసు జారీ చేసింది. ఢిల్లీలో కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో అక్కడి ఆస్పత్రులను మెడికల్ ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. వీటికి సంబంధించిన కేసులను విచారిస్తోన్న ఢిల్లీ హైకోర్టు.. కేంద్రం కేటాయించిన ఆక్సిజన్ ఒక్కరోజు కూడా రాష్ట్రానికి అందలేదనే విషయం కోర్టు దృష్టికి వచ్చిందని తెలిపింది. అలాంటప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసి ప్రయోజనమేంటని కేంద్రాన్ని నిలదీసింది.

అంతేగాక, ఢిల్లీలో ఆక్సిజన్ సంక్షోభం కొనసాగుతుండటం పట్ల కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆక్సిజన్ సరఫరా చేయడంలో మీకంటే ఐఐటీ, ఐఐఎంలే మెరుగ్గా పనిచేస్తాయని పేర్కొంది. ఢిల్లీలో ఆక్సిజన్ సరఫరాపై తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం ఓ నివేదిక రూపంలో ఢిల్లీ హైకోర్టు ముందుంచింది.
అయితే, నివేదిక ప్రకారం రోగులకు సరిపడా ఆక్సిజన్ ఉన్నప్పటికీ సరఫరాలో లోపం ఉన్నట్లు కోర్టు గుర్తించింది. దీంతో కేంద్రంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేగాక, ధిక్కరణ చర్యలకు ఎందుకు ఉపక్రమించకూడదంటూ షోకాజు నోటీసు జారీ చేసింది.
దేశంలో నెలకొన్న కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం వద్ద ఉన్న ప్రణాళికను తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే పలుమార్లు కేంద్రంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు పోతుంటే తాము చూస్తూ కూర్చోలేమని ఇటీవల ఘాటుగా స్పందించింది.












Click it and Unblock the Notifications