అజిత్ పవార్కు ఆ ‘పవర్’ ఉంది: అందుకే ఎన్సీపీ పెద్దల పాట్లు! కీలక టైంలో షాకిచ్చేనా?
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ మద్దతుతో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, వారి వద్ద మ్యాజిక్ ఫిగర్కు సరిపోయే ఎమ్మెల్యేలు లేరని ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్లు అంటున్నాయి. ఎన్సీపీ తమ వద్ద 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని,అజిత్ పవార్ ఒక్కరే బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

162 ఎమ్మెల్యేల మద్దతంటూ..
అయితే, అజిత్ పవార్ ఒక్కరే బీజేపీకి మద్దతిస్తున్నారని అంటున్న ఎన్సీపీ.. అతడ్ని తిరిగి తమ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నిస్తోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ వద్ద 162 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఇప్పటికే ప్రకటించాయి. అంతేగాక, గ్రాండ్ హోటల్ హయత్ వద్ద 162 మంది ఎమ్మెల్యేలతో బల ప్రదర్శన కూడా చేశారు.

అయినా అజిత్ పవార్ కావాలి..
అయినప్పటికీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆ పార్టీ కీలక నేతలు.. అజిత్ పవార్ను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే చర్యలను మాత్రం ఆపడం లేదు. సోమవారం కొందరు పార్టీ నేతలు అజిత్ పవార్ను బంధించి.. శరద్ పవార్తో మాట్లాడించే యత్నం కూడా చేశారని తెలిసింది. అయితే, వారి ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించలేదు.

ఎన్సీపీకి అజిత్ కావాలి ఎందుకంటే?
అజిత్ పవార్ కోసం ఎన్సీపీ పాకులాడటం వెనుక పెద్ద కారణమే ఉంది. ఎందుకంటే.. శరద్ పవార్ తర్వాత ఎన్సీపీ పార్టీలో అజిత్ పవార్ రెండో కీలక నేతగా ఎదిగారు. ఆయన కూడా పార్టీపై కొంత పట్టు ఏర్పడింది. ఆయనకు కూడా ఎన్సీపీలో అభిమానించే ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే ఇప్పుడు ఎన్సీపీ పెద్దలకు ఆందోళనను కలిగిస్తోంది.

కీలక సమయంలో షాకిచ్చినా ఆశ్చర్యం లేదు..
ఎన్సీపీలో శరద్ పవార్ తర్వాత అజిత్ పవార్కు ఎక్కువగా పట్టుంది. ఆయనకు పార్టీలో కొందరు మద్దతుదారులు ఉన్నారనేది కాదనలేని వాస్తవం. అవసరమైతే బలపరీక్ష రోజు ఆయనకు మద్దతుగా కొందరు ఎమ్మెల్యేలు గీత దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ విషయం ఎన్సీపీకి కూడా తెలుసని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత చెప్పడం గమనార్హం.

ఎన్సీపీ పెద్దలకు అదే భయం..
ప్రస్తుతానికి ఎన్సీపీ పార్టీకి చెందిన దాదాపు అందరు ఎమ్మెల్యేలు శరద్ పవార్ వెంటే ఉన్నారు. అయితే, అసెంబ్లీలో బలనిరూపణ రోజు తమ అభిమాన నేత అజిత్ పవార్కు మద్దతుగా పలుకుతూ బీజేపీ ప్రభుత్వానికి ఓటేసే అవకాశం ఉందని ఎన్సీపీ పెద్దలు భయపడుతున్నారు. అందుకే అజిత్ పవార్ను మళ్లీ ఎన్సీపీలోకి రప్పించే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు ఆ పార్టీ పెద్దలు. అజిత్ పవార్కు బంధువులైన రోహిత్ పవార్, సుప్రియా సూలే కూడా ఆయనను తిరిగి పార్టీలోకి రావాలంటూ సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు.












Click it and Unblock the Notifications