మా పథకాలే ఉచితాలా ? కేంద్రానివి కాదా ? సుప్రీంకోర్టుకు డీఎంకే సూటి ప్రశ్న
దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఉచితంగా పేర్కొంటూ వాటి ఔచిత్యాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించడాన్ని తమిళనాడులో అధికార డీఎంకే ఇవాళ తప్పుబట్టింది. ఉచితాలపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో తమనూ భాగస్వాముల్ని చేయాలని కోరింది. అసలు ఉచితాలని వేటిని పరిగణించాలన్న దానిపై ఇప్పటివరకూ నిర్దిష్టమైన విధానం లేదని తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను మాత్రమే 'ఉచితాలు' అని ఎందుకు ముద్రవేస్తున్నారని డీఎంకే సుప్రీంకోర్టును ప్రశ్నించింది. విదేశీ కంపెనీలకు కేంద్రం విధించిన 'పన్ను సెలవులు', పారిశ్రామికవేత్తల మొండి బకాయిల మాఫీ , అభిమానం కలిగిన గుత్తేదారులకు కీలకమైన కాంట్రాక్టులను ఎందుకు ఈ జాబితాలో చేర్చడం లేదని ఆ పార్టీ ప్రశ్నించింది.
ఇప్పటికే సుప్రీంకోర్టు విచారిస్తున్న 'ఉచితాల' కేసులో తమను కూడా పార్టీని చేయాలని కోరుతూ డీఎంకే పిటిషన్ దాఖలు చేసింది.ఉచితాలుగా పిలవడానికి ఏ పథకం అర్హమైనది అనేది తెలుసుకోవడానకి ఓ విధానం లేదని సుప్రీంకోర్టుకు గుర్తుచేసింది. సంక్షేమ పథకాలను ప్రకటించేందుకు రాజ్యాంగం రాష్ట్రాలకు అధికారం ఇచ్చిందని, సంక్షేమాన్ని అందించడానికి రాష్ట్రాల సామర్థ్యాన్ని పరిమితం చేయడానికి 'ఉచితాలు' అనే పదాన్ని అన్వయించలేమని పేర్కొంది.
Recommended Video
పేద కుటుంబాలు భరించలేని ప్రాథమిక అవసరాలను అందించడానికి ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టినట్లు తమ పిటిషన్ లో డీఎంకే తెలిపింది. వాటిని విలాసాలు అని చెప్పలేమంది. ఉచిత విద్యుత్ వంటి పథకాలు పేద కుటుంబంపై బహుముఖ ప్రభావాన్ని చూపుతాయని డీఎంకే పేర్కొంది. పేద కుటుంబాల అభ్యున్నతి కోసం రూపాయికే కేజీ బియ్యం, పేద కుటుంబాలకు కలర్ టెలివిజన్ సెట్లు, మహిళలకు ఉచిత బస్ పాస్లు వంటి అనేక సంక్షేమ పథకాలను తాము ప్రవేశపెట్టినట్లు పార్టీ తెలిపింది.ఉచిత సేవను అందించే సంక్షేమ పథకం సామాజిక క్రమాన్ని, ఆర్థిక న్యాయాన్ని కాపాడే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. విభిన్న జనాభా మరియు ప్రాంతాలు వేర్వేరు అవసరాలను కలిగి ఉంటాయి. రాష్ట్రం అందరినీ ఆదుకోవాలి. అన్ని రాష్ట్రాలకు ఒకే పథకాన్ని వర్తింపజేయలేమని కూడా పేర్కొంది.