జీఎస్టీ రద్దుకు మమతా బెనర్జీ లేఖ: సామాన్యుడిపై భారమంటూ వివరించిన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నుంచి కరోనా వ్యాక్సిన్లు, ఔషధాలు, ఆక్సిజన్ కాన్సట్రేటర్లకు మినహాయింపు ఇస్తే వాటి ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కరోనా వ్యాక్సిన్లు, ఔషధాలు, పరికరాలను జీఎస్టీ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీకి ఈ విషయంపై మమతా బెనర్జీ లేఖ కూడా రాశారు.
Recommended Video
జీఎస్టీ మాఫీ చేస్తే.. సామాన్యుడిపైనే వ్యాక్సిన్
ఈ నేపథ్యంలోనే నిర్మలా సీతారామన్ ట్విట్టర్ వేదికగా వారికి సమాధానమిచ్చారు. కరోనా వ్యాక్సిన్లు, ఔషధాలు, ఆక్సిజన్ కాన్సట్రేటర్లకు జీఎస్టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తే.. దేశీయ తయారీదార్లు ముడి పదార్థాలు, సేవలకు చెల్లించిన పన్నులు తిరిగి రాబట్టుకోలేక అంతిమంగా వాటి ధరలను పెంచుతారని, తద్వారా వినియోగారులపై భారం పడుతుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.
కరోనా వ్యాక్సిన్, ఔషధాలు ధరలు పెరిగే ఛాన్స్..
ప్రస్తుతం వ్యాక్సిన్లపై 5 శాతం, కరోనా ఔషధాలు, ఆక్సిజన్ కాన్సట్రేటర్లపై 12 శాతం జీఎస్టీ విధిస్తున్నట్లు తెలిపారు. జీఎస్టీ నుంచి ఆయా వస్తువులకు పూర్తి మినహాయింపు ఇస్తే.. వ్యాక్సిన్ తయారీదారులు ఇన్పుట్ ట్యాక్సెస్ను సర్దుబాటు చేసుకోలేక, వాటిని అంతిమ వినియోగదారులకు మళ్లిస్తారన్నారు. దీని ఫలితంగా కరోనా వ్యాక్సిన్లు, ఔషధాల ధరలు పెరుగుతాయని నిర్మలా సీతారామన్ వివరించారు. జీఎస్టీలో సుమారు సగం వరకు ఆదాయం రాష్ట్రాల అభివృద్ధికి వినియోగించబడుతుందని పేర్కొన్నారు.
ఐజీఎస్టీ, సుంకాలు రద్దు చేశాం.. ఆ పన్ను భారం కేంద్రానిదే
ఇప్పటికే కరోనా వ్యాక్సిన్లు, ఔషధాలపై ఐజీఎస్టీ, కస్టమ్స్ సుంకం రద్దు చేసినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. రెమిడిసివిర్ ఔషధానికి అన్ని రకాల సుంకాల నుంచి మినహాయింపు కల్పించామని తెలిపారు. ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా, నిల్వకు సంబంధించిన యంత్రాలు, పరికరాలపైనా సుంకం నుంచి మినహాయింపు ఉందని పేర్కొన్నారు.
45ఏళ్లపైబడినవారితోపాటు కరోనా ఫ్రంట్ లైన్ వారియర్లకు కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్లను ఇస్తోందని గుర్తు చేశారు. వాటికి సంబంధించిన జీఎస్టీని పూర్తిగా కేంద్రమే భరిస్తోందని స్పష్టం చేశారు. ఈ మేరకు వరుస ట్వీట్లతో మమతా బెనర్జీకి సమాధానమిచ్చారు నిర్మలా సీతారామన్.