ప్రియుడితో భర్తను ముక్కలు చేసి ఫ్రిజ్లో పెట్టింది
సేలం: ప్రియుడి వ్యామోహంలో ఉన్న ముగ్గురు బిడ్డల తల్లి భర్తను అతిదారుణంగా హత్య చేసిన సంఘటన తమిళనాడులోని సేలంలో జరిగింది. హత్య కేసులో మహిళతో పాటు నలుగురిని సేలం పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తి శరీరంలోని భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
సేలంలోని అమ్మాపాళయం ప్రాంతంలో బాలకృష్ణన్(45), సుందరి (35) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. బాలకృష్ణన్ సొంతంగా సెలూన్ (బార్బర్) షాప్ నిర్వహిస్తున్నాడు. వీరు రాజేంద్రన్ అనే వ్యక్తి ఇంటిలో అద్దెకు ఉంటున్నారు.
గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో బాలకృష్ణన్ అదృశ్యం అయ్యాడు. బాలకృష్ణన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో అప్పటి నుండి అతని కోసం గాలిస్తున్నారు. ఇంటి యజమాని రాజేంద్రన్ కుమారుడు లోకనాథన్ నిత్యం సుందరి ఇంటికి వచ్చి వెళుతున్న విషయం పోలీసుల కంటపడింది.
అనుమానం రావడంతో లోకనాథన్ ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పుడు లోకనాథన్, సుందరిల మద్య ఉన్న అక్రమ సంబంధం విషయం బయటపడింది. గత సంవత్సరం వీరిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం బాలకృష్ణన్ కంటపడింది.
ఇద్దరికి వార్నింగ్ ఇచ్చాడు. తమ మధ్య బాలకృష్ణన్ అడ్డుగా ఉన్నాడని భావించిన సుందరి, లోకనాథన్ ఎలాగైనా అంతం చెయ్యాలని ప్లాన్ వేశారు. గత సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీ రాత్రి బాలకృష్ణన్ మద్యం సేవించి ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. సుందరి ప్రియుడు లోకనాథన్ కు సమాచారం ఇచ్చింది.
ఇంటి తలుపులు తీసి పెట్టింది. లోకనాథన్ తన స్నేహితులు రేవన్ (24), కుమార్ (24)లతో కలిసి సుందరి ఇంటికి వెళ్లాడు. రాత్రి ఆదమరచి నిద్రపోతున్న బాలకృష్ణన్ ను అతని భార్య సుందరి, ప్రియుడు లోకనాథన్, రేవన్, కుమార్ కలిసి కత్తులతో పోడిచి దారుణంగా హత్య చేశారు.
తరువాత మృతదేహాన్ని తరలించడం కష్టం కావడంతో వేటకొడవలి తీసుకుని బాలకృష్ణన్ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచి పెట్టారు. ఇల్లు శుభ్రం చేసిన తరువాత ముగ్గురు అక్కడి నుండి వెళ్లిపోయారు. రెండు మూడు రోజుల తరువాత ఒక్కో భాగాన్ని బయటకు తీసుకు వెళ్లారు.
సమీపంలోని స్మశానంలో అక్కడక్కడ పాతిపెట్టారు. నిందితులు చెప్పిన వివరాలు తెలుసుకుని షాక్ కు గురైనామని ఇన్సెపెక్టర్ మురగేషన్ అన్నారు. బాలకృష్ణన్ శరీరంలోని భాగాల కోసం స్మశానంలో గాలిస్తున్నామని మురగేషన్ వివరించారు.