పెళ్లితో భార్య మతం మారదు, భర్తకు లేని అడ్డంకులు భర్యకెందుకు?: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మతాంతర వివాహాలు చేసుకున్నా మహిళల మతం మారదని గురువారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహం తర్వాత భర్త మతమే ఆమెకు వర్తిస్తుందని తెలిపే చట్టాలేమీ లేవని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ విషయంలో ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విభేదించింది. వివాహానంతరం మహిళల మతం వారి భర్త మతంతో కలిసిపోతుందంటూ ముంబై హైకోర్టు గతంలో ఓ కేసులో రూలింగ్ ఇచ్చింది.
ఒకవేళ ఇతర మతానికి చెందిన పురుషుడ్ని.. పార్శీ మహిళ వివాహం చేసుకుంటే ఆమె మత పరమైన గుర్తింపు కోల్పోతుందా? అన్న అంశంపై దాఖలైన పిటిషన్ను రాజ్యాంగ ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
ఈ సందర్భంగా.. ఒక పార్సీ పురుషుడు ఇతర మతానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నప్పుడు ఇదే నిబంధన వర్తిస్తుందా? అని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏఎమ్ ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన రాజ్యంగ ధర్మాసనం ప్రశ్నించింది.
పార్శీ మతాచారం ప్రకారం జరిగే తన తల్లిదండ్రుల అంత్య క్రియల్లో తనకు ప్రవేశం లేదనడంపై గూల్రోఖ్ గుప్తా అనే పార్శీ మహిళ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పెళ్లి అనేది మహిళలకుండే పౌరహక్కులను హరించివేయజాలదని పేర్కొంది.
ఈ కేసులో గూల్రోఖ్ గుప్తా తరుపున తన వాదనలను వినిపించిన అడ్వకేట్ ఇందిరా జైసింగ్ను సుప్రీంకోర్టు అభినందించింది. పెళ్లికి అర్థం.. ఓ మహిళ తన భర్తకు తనంతట తాను తాకట్టు పెట్టుకోవడం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
వేర్వేరు మతాలకు చెందిన యువతీయువకులు ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకోవచ్చని, వివాహానంతరం కూడా ఎవరి మతాచారాలు వారు పాటించవచ్చని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ చెబుతోందంటూ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది.
పెళ్లయినంత మాత్రాన భర్త మతం భార్యకు సంక్రమించదని, ఇలా అని ఏ చట్టమూ చెప్పడం లేదని పేర్కొంది. ఈ పిటిషన్ పై వల్సాద్ జొరాస్ట్రియన్ ట్రస్ట్ అభిప్రాయాన్ని ఈ నెల 14న అందజేయాలని సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రమణ్యాన్ని సుప్రీంకోర్టు కోరింది.