వలసదారులపై ఉక్కుపాదం.. వెనక్కి పంపిస్తామని కేంద్రం స్పష్టీకరణ
న్యూఢిల్లీ : దేశంలోకి అక్రమంగా చొరబడ్డ వలసదారులపై ఉక్కుపాదం మోపుతామని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. అక్రమంగా చొరబడ్డ వారికి దేశంలో చోటులేదని తేల్చిచెప్పింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా జాతీయ పౌర రిజిస్టర్ తుది జాబితా రూపొందిస్తామని పేర్కొన్నది. ఈ దేశ జానెడు భూమి కూడా దేశ పౌరులకే చెందుతుందని నొక్కి వక్కానించింది. ఈ మేరకు రాజ్యసభలో ఎస్పీ నేత అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు.
ఉపేక్షించం ..
దేశంలోని అక్రమ చొరబాటుదారులపై కఠినంగా వ్యవహరిస్తామని అమిత్ షా మరోసారి స్పష్టంచేశారు. దేశంలో ఏ మూలన దాగి ఉన్న వలసదారులను గుర్తిస్తామని పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా వారిని దేశం నుంచి పంపిస్తామని తెలిపారు. జాతీయ పౌరసత్వ రిజిస్టర్కు సంబంధించి ఎస్పీ ఎంపీ జావేద్ అలీఖాన్ అడిగిన అనుబంధ ప్రశ్నకు అమిత్ షా సమాధానం ఇచ్చారు. అసోం కాక దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీని అమలు చేస్తామని, దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం అసోంలో మాత్రమే జాతీయ పౌరసత్వ రిజిస్టర్ అమల్లో ఉందని తెలిపారు. జూలై 31 వరకు తుది గడువు ఉందనే విషయాన్ని సభదృష్టికి తీసుకొచ్చారు.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అమిత్ షా పేర్కొన్నారు. ఇందులో జాతీయ పౌరసత్వ రిజిస్టర్, వలసదారుల అంశం ఉందని గుర్తుచేశారు. అసోంలో ఎన్ఆర్సీ గురించి చాలా వినతులు వచ్చాయని గుర్తుచేశారు. 25 లక్షల అభ్యర్థనలతో జాతీయ పౌరసత్వ రిజిస్టర్ సర్వే వివరాలను మరోసారి పరిశీలించాలని రాష్ట్రపతి ఆదేశించారని గుర్తుచేశారు. ఇందులో కొందరి పేర్లు పొరపాటున కూడా వచ్చి ఉంటాయని, మరోసారి పరిశీలించాలని కోరడంతో .. గడువు పెంచాలని సుప్రీంకోర్టును కూడా కోరినట్టు పేర్కొన్నారు. అయితే వలసదారులను పంపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందే తప్ప .. అర్హులని కాదని గుర్తుచేశారు. దేశంలో రోహింగ్యా ముస్లింలు భారీగా చొరబడ్డారని తెలిపారు. అయితే వారు ఏ స్థాయిలో వచ్చారనే అంశంపై స్పష్టత లేదని చెప్పారు. వారిలో కొందరు ఇప్పటికే బంగ్లాదేశ్ వెళ్లారని వెల్లడించారు.












Click it and Unblock the Notifications