మేం జోక్యం చేసుకోం: ఎంసెట్ వివాదంపై తేల్చేసిన వెంకయ్య
న్యూఢిల్లీ: ఎంసెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలు కలిసి చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు సూచించారు. లేదంటే ఆ రాష్ట్ర గవర్నరే సమస్యకు పరిష్కారం చూపాలని ఆయన అన్నారు. కేంద్రం జోక్యం చేసుకుంటే అనవసర వివాదం అవుతుందని, రెండు రాష్ర్టాలు కోరితేనే కేంద్రం కల్పించుకుంటుందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అయినా ఈ విషయం కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళతానని ఆయన బుధవారం మీడియాతో అన్నారు.
చిన్న చిన్న సమస్యలను పెద్దదిగా చేసుకుని విద్యార్థులను ఆందోళనకు గురిచేయడం సరికాదని హితవు పలికారు. కొత్తగా రాష్ర్టాలు ఏర్పాటైనప్పుడు సమస్య వస్తే వాటి పరిష్కారం కోసం గవర్నర్ వ్యవస్థ ఒకటి ఉందని, అ వ్యవస్థ ద్వారా పరిష్కారం అయితే బాగుండేదని, కానీ అలా జరగలేదని ఆయన అన్నారు.

మంగళవారం ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు తనను కలిసారని, అయితే తాము జోక్యం చేసుకునే విషయం కాదని చెప్పానని ఆయన తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై ఏమైనా అనుమానాలు వచ్చినప్పుడు గవర్నర్ అయినా జోక్యం చేసుకోవాలని, లేదా గృహశాఖ మంత్రి అయినా జోక్యం చేసుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు.
ఈ విషయాన్ని హోం మంత్రికి వివరిస్తానని కూడా చెప్పానని, బుధవారం ఆ మంత్రితో మాట్లాడతానని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కేంద్రం జోక్యం చేసుకుంటే రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకుందని విమర్శించే అవకాశం ఉందని, ఇద్దరూ కేంద్రం ముందుకు వచ్చి సమస్యను పరిష్కరించాలని కోరితే అప్పుడు జోక్యం చేసుకుంటామని వెంకయ్య అన్నారు.
ఎంసెట్ నిర్వహణ విషయంలో తెలుగు రాష్ర్టాల మధ్య ఏర్పడ్డ వివాదంలో జోక్యం చేసుకోలేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారంనాడే స్పష్టం చేశారు. రెండు రాష్ర్టాల విద్యాశాఖ మంత్రులు చర్చించుకొని సమస్యను పరిష్కరించు కోవాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు కేంద్ర హోంమంత్రి రాజనాధ్ను కలిసినప్పుడు కూడా తాను ఇదే విషయాన్ని చెప్పానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications