విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధిగా పవార్ ? జగన్ సహా వారి మద్దతుపై ఆశలు- కలిసొస్తున్నసమీకరణాలివే !
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి గట్టిపోటీ ఇచ్చేందుకు విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ఇతర విపక్షాలకు టచ్ లోకి వెళ్లారు. ఇప్పుడు విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్ధిని ఎంపిక చేసేందుకు రేపు ఢిల్లీలో దాదాపు 22 పార్టీల నేతలు భేటీ అవుతున్నారు. ఇందులో యూపీయేతర విపక్ష పార్టీల్ని ఆకట్టుకునే నేతను రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి
విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎవరుండాలనే అంశంపై చర్చించేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల్ని ఏకగ్రీవం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ఇద్దరు నేతల్ని రంగంలోకి దించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ విపక్షాల్ని బుజ్జగించే పనిలో పడ్డారు. దీంతో ఈ ప్రయత్నాల్ని అడ్డుకుని విపక్షాల అభ్యర్ధిని ప్రకటించేందుకు పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. రేపు ఢిల్లీలో జరిగే భేటీలో రాష్ట్రపతి అభ్యర్ధిని ప్రకటించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.

విపక్షాల అభ్యర్ధిగా శరద్ పవార్ ?
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా ఎన్సీపీ అధినేత, రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ ను నిలబెట్టేందుకు పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందులో విపక్షాల్లో కీలకమైన తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచన మేరకు శరద్ పవార్ అభ్యర్దిత్వంపై విపక్షాల్లో చర్చ మొదలైంది. యూపీయేలో లేని రాజకీయ పక్షాల్ని ఆకట్టుకునే వ్యక్తిగా శరద్ పవార్ అభ్యర్ధిత్వాన్ని టీఎంసీ సమర్ధిస్తోంది. ఇతర విపక్ష పార్టీల మద్దతు కూడా లభిస్తే రాష్ట్రపతి అభ్యర్ధిగా పవార్ ఎంపికయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

రేపటి విపక్షాల భేటీ కీలకం
రాష్ట్రపతి ఎన్నికల్లో తన అభ్యర్ధిత్వంపై విపక్షాల నుంచి సంకేతాలు అందుతున్నా శరద్ పవార్ మాత్రం ఇప్పటివరకూ నోరు విప్పలేదు. ఇప్పటికే ఆయన్ను రాష్ట్రపతి అభ్యర్ధిగా సమర్ధించేందుకు కాంగ్రెస్, ఆప్, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ మల్లిఖార్జున్ ఖర్గేను, ఆప్ సంజయ్ సింగ్ ను ఇందుకోసం రంగంలోకి దింపింది.
రేపు ఢిల్లీలో జరిగే విపక్షాల భేటీకి 22 పార్టీలు హాజరవుతున్నాయి. ఈ భేటీలో ఉమ్మడి అభ్యర్ధిని ఎంపిక చేసేందుకు విపక్షాలు కీలక చర్చలు జరపబోతున్నాయి.

శరద్ పవారే ఎందుకు ?
ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్ధిగా నిలబడి విపక్షాల నుంచి ఏకగ్రీవంగా మద్దతు పొందే అవకాశం ఉన్న నేతలు చాలా తక్కువ. కాబట్టి రాజకీయ కురువృద్ధుడైన పవార్ ను నిలబెడితే వైసీపీ, టీఆర్ఎస్, బీజేడీ వంటి విపక్ష పార్టీలు కచ్చితంగా మద్దతిస్తాయని ఇతర పార్టీలు అంచనా వేస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిని నిలబెడితే ఈ పార్టీలన్నీ మద్దతిచ్చే అవకాశాల్లేవు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ వంటి వారికి పవార్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో పలుమార్లు ఏపీలో పరిణామాల్ని సైతం జగన్ పవార్ కు వివరించి మద్దతు కోరారు. అలాగే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పవార్ అభ్యర్ధిత్వం అయితే కచ్చితంగా మద్దతిచ్చే అవకాశముంది. దీంతో విపక్షాలు పవార్ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications