ముందు బెంగాల్ను గెలుస్తా- తర్వాత ఢిల్లీని గెలుస్తా- మమతా బెనర్జీ ధీమా
పశ్చిమబెంగాల్లో మూడో దశ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ సీఎం మమతా బెనర్జీ తన విజయంపై మరోసారి ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ను ఇప్పుడు గెలుస్తున్నా, భవిష్యత్తులో ఢిల్లీనీ గెలుస్తానంటూ తృణమూల్ అధినేత్రి జోస్యం చెప్పారు. హుగ్లీ జిల్లాలోని దేబానంద్పూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మమతా బెనర్జీ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
మమత పోటీ చేస్తున్న నంద్రిగ్రామ్ నియోజకవర్గానికి రెండోదశలో భాగంగా ఎన్నికలు జరిగాయి. పోలింగ్ తర్వాత మమతపై తన గెలుపుపై ధీమా వ్యక్తం చేయగా.. బీజేపీ నేతలు మాత్రం ఆమె మరో నియోజకవర్గం వెతుక్కుంటున్నారని ఆరోపణలు చేశారు. దీంతో నందిగ్రామ్లో మమత గెలుపు అంత సులువు కాదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ ఆరోపణల్ని కొట్టిపారేసిన మమత తాను మరో నియోజకవర్గంలో పోటీ చేసే ప్రశ్నే లేదన్నారు.
కరోనా వేళ పశ్చిమబెంగాల్లో ఎన్నికలను 8 దశల్లో నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం తీరును కూడా మమత తీవ్రంగా ఆక్షేపించారు. ఈసీ వ్యవహారాల్లో కేంద్రంలోని బీజేపీ జోక్యం చేసుకుంటోందని ఆమె మండిపడ్డారు. ఎనిమిది దశల్లో ఎన్నికలు ఎందుకు ? సాధ్యమైనంత తక్కువ దశల్లో నిర్వహించలేరా ? కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇలా సుదీర్ఘంగా ఎన్నికలు నిర్వహించడం ఎవరికి ప్రయోజనం అని మమత ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీకి సొంత అభ్యర్ధులు లేరని, తృణమూల్, సీపీఎం నుంచి అరువు తెచ్చుకున్న అభ్యర్ధులనే బీజేపీ రంగంలోకి దింపుతోందని మమత ఆరోపించారు.