నిన్న సైన్యంపై రాళ్లు రువ్విన కాశ్మీర్ యువతి, నేడు ఫుట్బాల్ కెప్టెన్: కేంద్ర ప్రభుత్వం వల్లే
శ్రీనగర్: కాశ్మీర్ రాష్ట్రంలోని యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, స్వతంత్ర్యం లేకుండా పోయిందని ఆరోపిస్తూ కొద్ది రోజుల క్రితం మొన్న భారత సైన్యంపై రాళ్లు రువ్విన యువతి అఫ్సానా ఆషిక్. ఆమె ముఖానికి ముసుగు ధరించి, వీపుపై పుస్తకాల బ్యాగుతో పోలీసుల పైకి రాళ్లు రువ్వింది.
ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఆ అమ్మాయి ఎవరన్న విషయమై చర్చ జరిగింది. ఆమె మంచి ఫుట్బాల్ క్రీడాకారిణి అని, రాష్ట్రంలో అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాలపై ఉన్న ఆగ్రహమే ఆమెను అలా మార్చిందని కథనాలు వచ్చాయి. ఆపై రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్వయంగా ఆమెను కలవాలని నిర్ణయించారు.
బాలీవుడ్ సినిమా ఓ కారణం
రాష్ట్రంలో మహిళల ఫుట్బాల్ను ప్రమోట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడా అఫ్సానే, జమ్మూ కాశ్మీర్ మహిళా ఫుట్బాల్ జట్టు కెప్టెన్. ఇండియన్ ఉమెన్ లీగ్లో జట్టును ముందుకు తీసుకెళ్లడం ఇప్పుడు ఆమె ముందున్న లక్ష్యం. ఇప్పటి వరకూ పురుషులు మాత్రమే ఆధిపత్యం చూపిన ఫుట్బాల్ ఆటపై తనకు మక్కువ పెరగడానికి బాలీవుడ్లో విడుదలైన సినిమానే కారణమని అఫ్సానా చెప్పారు.
కేంద్రం ఓపికతో సమస్యలు విన్నది
అఫ్సానే గతంలో ముంబై క్లబ్ తరఫున ఆడింది. తమ సమస్యలను కేంద్రం ఎంతో ఓపికతో విని మౌలిక వసతులు కల్పించడానికి ముందుకు వచ్చిందని, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తమ ముందే సీఎం ముఫ్తీని పిలిచి, శ్రీనగర్ వెళ్లగానే కోచింగ్ కోసం అత్యాధునిక పరికరాల వరకూ ఏర్పాటు చేయాలని సూచించారని అఫ్సానా చెప్పారు.
రాళ్ల దాడికి
నాడు తాను రాళ్ల దాడికి దిగి ఉండాల్సింది కాదని అఫ్సానా చెప్పారు. అయితే, తన జట్టులోని ఓ అమ్మాయిని పోలీసు కొట్టడంతోనే ఆ పని చేశానని చెప్పారు. ఫుట్బాల్ క్రీడలో తన రాష్ట్రానికి గర్వకారణంగా నిలవడమే తన ముందున్న లక్ష్యమన్నారు.
నాడు పోలీసుల పైకి రాళ్లు
కాగా, గత ఏడాది కోపంతో పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. అప్పుడు ఆమె ఫోటో జాతీయ మీడియాలో నానింది. ఇప్పుడు అదే అమ్మాయి ఫుట్ బాల్ టీం కెప్టెన్గా ఉండటంతో మరోసారి మీడియాను ఆకర్షించారు.