వీలైనంత త్వరగా ఓటేయండి..: కర్ణాటక ఎన్నికలకు వరుణ గండం!
బెంగళూరు: నేటి ఉదయం 7గం. నుంచి కర్ణాటక వ్యాప్తంగా 222అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కర్ణాటకకు వరుణ గండం పొంచి ఉండటంతో ఓటర్లు వీలైనంత త్వరగా తమ ఓటు హక్కు వినియోగించాలని వాతావరణశాఖ ప్రకటించింది.
'మా అంచనా ప్రకారం కర్ణాటకలో శనివారం తేలికపాటి జల్లుల నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.' అని వాతావరణశాఖ సిబ్బంది సీఎస్ పాటిల్ తెలిపారు. మధ్యాహ్నాం తర్వాత వర్షం కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు చెప్పారు.

ఇంతకుముందు వాతావరణశాఖ వెల్లడించిన ప్రకారం కర్ణాటకలోని 30 జిల్లాల్లో 20జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే కొప్పల్, రాయచూర్, యాద్గిర్, బీదర్, ఉత్తర కన్నడ, ఉడిపి, దక్షిణ్ కన్నడ జిల్లాల్లో మాత్రం వర్షం కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది.
కాగా, ఓటర్లను పోలింగ్ బూత్ కేంద్రాలకు తరలించడానికి ఆయా పార్టీలు భారీ ఏర్పాట్లే చేశాయి. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండటానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం రాత్రి పార్టీ పోలింగ్ బూత్ టీమ్స్ ను ఆదేశించారు.












Click it and Unblock the Notifications