మహిళా సాధికారత లేకుండా దేశం పురోగతి చెందదు.. : సీఎం నవీన్ పట్నాయక్
మహిళా సాధికారతే దేశ సాధికారత అని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. మహిళా సాధికారత లేకుండా ఏ ఇల్లు,సమాజం,దేశం ముందుకు సాగలేవన్నారు. మహిళా సాధికారత అంశం తమ అడ్మినిస్ట్రేషన్లో కీలక అంశమని... తాను బాగా ఇష్టపడే అంశమని పట్నాయక్ అన్నారు. శనివారం(డిసెంబర్ 26) బిజూ జనతాదళ్ 24వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి నవీన్ పట్నాయక్ ప్రసంగించారు.
'తమ ఇంటి,కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నెరవేరుస్తున్న మహిళలు గ్రామ పంచాయతీ సమితిలు,జిల్లా పరిషత్లను కూడా అంతే సమర్థవంతంగా నడిపించగలరని నమ్మకం నాకున్నది. తల్లులు ఈ సమాజాన్ని పురోగతి వైపు నడిపించే చక్రాల లాంటివారు. వారి అభివృద్దితోనే సమాజ పురోగతి సాధ్యం. లేకపోతే ఈ సమాజం ముందుకు వెళ్లలేదు.' అని నవీన్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు.
'బిజూ జనతా దళ్ వ్యవస్థాపకులు బిజూ బాబు స్థానిక సంస్థల్లో,ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఒక చరిత్ర లిఖించారు. బిజూ బాబు సిద్దాంతాలకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో మా ప్రభుత్వం మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించింది. అంతేకాదు,అసెంబ్లీ-పార్లమెంటులోనూ మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని మేము పోరాడుతున్నాం. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో మహిళలకు 33శాతం టికెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీజేడీ.' అని నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు.
జాతీయ పార్టీలన్నీ మహిళా సాధికారతను ఎన్నికల వాగ్దానాలకే పరిమితం చేశాయని నవీన్ పట్నాయక్ విమర్శించారు. ఎన్నికలు రాగానే మహిళలకు వాగ్దానం చేయడం,ఆ తర్వాత మరిచిపోవడం కామన్ అయిందన్నారు. కానీ బీజేడీ మహిళల హక్కుల కోసం నిజాయితీగా పనిచేస్తోందన్నారు. జనాభాలో సగం ఉన్న మహిళలు వారి హక్కులను కోల్పోకూడదని... దేశ రాజకీయాల్లో వారికి సరైన అవకాశాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. మహిళలకు చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్లపై జాతీయ పార్టీలకు తాము ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే ఉన్నామని అన్నారు.