బెంగళూరులో మహిళ దారుణ హత్య, కుమార్తె లవ్ మ్యారేజ్, స్నేహితురాలు, ఇంటిలోనే!
బెంగళూరు: బెంగళూరు నగరంలో ఒంటరిగా ఇంటిలో ఉన్న మహిళను అతిదారుణంగా హత్య చేశారు. మారణాయుధాలతో మహిళను హత్య చేసిన హంతకులు తరువాత ఇంటి తలుపులు మూసివేసి దర్జాగా వెళ్లిపోయారని పోలీసులు అన్నారు.
చామరాజపేట
బెంగళూరులోని చామరాజపేట ఐదవ మెయిన్ రోడ్డులో విజయ (50) అనే మహిళ నివాసం ఉంటున్నారు. మంగళవారం ఈమె ఇంటిలో ఒంటరిగా ఉన్నారు. రాత్రి 10 గంటల సమయంలో విజయను పలకరించడానికి ఆమె స్నేహితురాలు చామరాజపేటకు వెళ్లారు.
ఇంటిలోనే నరికేశారు
ఇంటిలోకి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు విజయను మారణాయుధాలతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. తరువాత మారణాయుధాలు వెంట తీసుకున్న నిందితులు ఇంటి తలుపులు మూసివేసి దర్జాగా వెళ్లిపోయారు.
కుమార్తె లవ్ మ్యారేజ్
స్నేహితురాలు వచ్చి చూసిన తరువాతే విజయ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. కొంత కాలం క్రితం విజయ కుమార్తె తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లి పోయింది. తరువాత విజయ చామరాజపేటలోని అద్దె ఇంటిలో ఒంటరిగా నివాసం ఉంటున్నారు.
భర్త ఆచూకి లేదు
విజయ భర్త ఆచూకి ఏమాత్రం తెలియదని స్థానికులు, ఆమె స్నేహితులు చెబుతున్నారని పోలీసులు అన్నారు. కుమార్తె తనను ఎదిరించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన తరువాత విజయ షాక్ కు గురైనారని ఆమె స్నేహితులు అంటున్నారు.
పరిచయం ఉన్నవాళ్లే
విజయను హత్య చేసిన వాళ్లు ఇంటిలో ఎలాంటి వస్తువులు చోరీ చెయ్యలేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అంటే విజయను హత్య చేసింది దొంగలు కాదని, ఆమెకు బాగా పరిచయం ఉన్న వాళ్లే హత్య చేశారని పోలీసులు అంటున్నారు.