'పది' నోటు రేపిన చిచ్చు: నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్య..
జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేక ఇంటికి వెళ్లి ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకుంది.
పుణే: కూలీ నాలీ చేసుకుని ప్రతీ పైసాను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునే పేద కుటుంబాలకు పది రూపాయలు చాలా విలువైనవే. అలా.. పది రూపాయల దగ్గర వచ్చిన ఓ పేచీ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. బలవంతంగా లాక్కున్నందుకు.. తిరిగి నిలదీసే ప్రయత్నం చేయగా చంపేస్తామని బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.
సేనాపతి బాపట్ రోడ్డులో సుందరమ్మ-పరశురామ్ అనే దంపతులు నివసిస్తున్నారు. పరశురామ్ స్థానికంగా కూలీగా పనిచేస్తున్నాడు. వీరికి రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు. ఇదే క్రమంలో ఓ రోజు కుమారుడికి రూ.10నోటు ఇచ్చి పచారీ కొట్టుకు పంపించింది సుందరమ్మ.
రాహుల్ ఆ నోటుతో దుకాణానికి వెళ్తుండగా.. పొరుగింటి పిల్లవాడు ఆ నోటును బలవంతంగా లాక్కున్నాడు. విషయం తల్లికి చెబితే.. వెళ్లి ఆ పిల్లవాడి తల్లిని అడిగింది. అంతే.. సుందరమ్మతో వాగ్వాదానికి దిగిన ఆ కుటుంబం చంపేస్తాం అంటూ బెదిరించింది. అందరిముందు అవమానించడంతో సుందరమ్మ తీవ్ర మనస్తాపానికి లోనైంది.
ఇంటికి వెళ్లి ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకుంది. కాలిన గాయాలతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు తుది శ్వాస విడిచింది. దీంతో ఆమె భర్త పరశురామ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
పరుశురామ్ ఫిర్యాదుతో సుందరమ్మను అవమానించిన హరీష్ లక్ష్మణ్ గైక్వాడ్(19) తో పాటు మరో 35ఏళ్ల మహిళను అరెస్టు చేశారు. నిందితుల్లో 12ఏళ్ల మైనర్ బాలికను కూడా చేర్చడం గమనార్హం.