కదులుతున్న కారులో యువతిపై 3 గంటల పాటు ముగ్గురు రేప్
న్యూఢిల్లీ: మహిళల పైన దురాఘతాలు ఆగడం లేదు. ముంబైలో ఓ మహిళ పైన భర్త పక్కన ఉండగానే సామూహిక అత్యాచారం చేసిన ఘటన మరవకముందే హర్యానాలో ఓ దళిత యువతి పైన కదులుతున్న కారులో మూడు గంటల పాటు అత్యాచారం జరిగింది.
నార్వానా - తోహన రోడ్డులో ముగ్గురు యువకులు ఆమె పైన అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు బుధవారం నాడు తెలిపారు. ఈ సంఘటన మంగళవారం నాడు సాయంత్రం చోటు చేసుకున్నదని చెప్పారు. ఇందుకు సంబంధించి తోహన పోలీసు స్టేషన్లో ఫిర్యాదు అందినట్లు చెప్పారు.
ఆమె రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు రోడ్డుపై నిలబడింది. అంతలో ఓ కారు ఆమె ముందు వచ్చి ఆగింది. తాము అటు వైపే వెళ్తున్నామని ఆమెను నమ్మించారు. రైల్వేస్టేషన్ వద్ద విడిచిపెడతామన్నారు. దీంతో వారిని నమ్మి ఆమె కారు ఎక్కింది.
కారు వెళ్తుండగా ముగ్గురు యువకులు ఆమెను లైంగికంగా వేధించారు. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. ఇవే అంశాలతో బాధితురాలు ఫిర్యాదు చేసిందని చెప్పారు. ఆమె పైన గంటల పాటు అత్యాచారం చేసిన అనంతరం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ధహమన్ గ్రామంలో విడిచిపెట్టారు.
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. కారు ఎవరిదో గుర్తించలేదు. బాధితరాలు కూడా గుర్తించలేకపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.