వివాహేతర సంబంధం : ప్రియుడితో కలిసి ప్లాన్ వేసి అత్తను చంపిన కోడలు
తన వివాహేతర సంబంధానికి అత్త అడ్డుగా ఉందని భావించిన ఓ కోడలు పాము కాటుతో ఆమెను హత్య చేయించింది. అయితే దీని వెనకాల కుట్రను పసిగట్టలేని కుటుంబ సభ్యులు పాము కాటు వల్లే ఆమె చనిపోయిందనుకున్నారు. కానీ ఈ ఘటన జరిగిన నెలన్నర రోజులకు వారిలో అనుమానం మొదలైంది. కుట్రకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా దొరకడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు కోడలే అత్తను హత్య చేసిందని నిర్దారించారు.
అసలేం జరిగింది
అల్పన-సుబోధ్ దేవి అత్తాకోడళ్లు. రాజస్తాన్లోని జున్జును జిల్లాలోని ఓ గ్రామంలో వీరు నివసిస్తున్నారు. సుబోధ్ దేవి కుమారుడు సచిన్తో అల్పనకు 2018లో వివాహమైంది. అయితే సచిన్ సైన్యంలో పనిచేస్తుండటంతో అప్పుడప్పుడు మాత్రమే ఇంటికి వస్తుంటాడు. అతని సోదరుడు చిరంతన్ కూడా సైన్యంలోనే పనిచేస్తున్నాడు. సుబోధ్ దేవి భర్త వృత్తి రీత్యా వేరే పట్టణంలో ఉంటుండటంతో.. ఇంటి వద్ద అత్తా కోడళ్లు మాత్రమే ఉంటున్నారు.
వివాహేతర సంబంధం
అల్పనకు కొద్దిరోజుల క్రితం మనీష్ అనే జైపూర్ వ్యక్తితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరూ తరుచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. కోడలు తరుచూ ఫోన్లో మాట్లాడుతుండటంతో అత్త సుబోధ్ దేవి మందలించింది. దీంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న అత్తను అడ్డు తొలగించుకోవాలని భావించింది.
ప్రియుడితో కలిసి ప్లాన్
అత్తను తొలగించుకోవడానికి ప్రియుడితో కలిసి ఆమె స్కెచ్ వేసింది. పాము కాటుతో ఆమెను చంపాలని ఇద్దరు కలిసి నిర్ణయించారు. జూన్ 2, 2019న సుభోద్ దేవి నిద్రిస్తున్న సమయంలో.. ఆమె గదిలోకి పామును పంపించారు. పాము కాటుతో ఆమె మృతి చెందింది. కుటుంబ సభ్యులు కూడా పాము కాటు వల్లే ఆమె చనిపోయిందనుకున్నారు.
ఇలా బయటపడింది..
సుబోధ్ దేవి చనిపోయిన నెలన్నర రోజులకు కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. అల్పన ప్రవర్తనపై అనుమానం కలగడం,కొన్ని ఆధారాలు కూడా దొరకడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో అల్పన వివాహేతర సంబంధం బయటపడింది. ఆమె ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా.. జూన్ 2న అల్పన-మనీష్లు 124 సార్లు మాట్లాడుకున్నట్టు గుర్తించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అల్పన నేరం అంగీకరించక తప్పలేదు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు జనవరి 4న అల్పన్,మనీష్లతో పాటు వారికి సహకరించిన కృష్ణ కుమార్నే వ్యక్తిని అరెస్ట్ చేశారు.