విషాదం: పెళ్లి వేడుకలో గాల్లోకి కాల్పులు, యువతి మృతి
ఛండీగఢ్: పెళ్లి వేడుకల్లో ఎన్నో ప్రాణాలు పోతున్నా.. ఆ దిక్కుమాలిన తుపాకీ కాల్పుల సంస్కృతిని మాత్రం విడటం లేదు కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు. తాజాగా హోషియార్పూర్లో పెళ్లి సంబరాల్లో పేలిన తుపాకీ ఓ యువతి ప్రాణం తీసింది.
వివరాల్లోకి వెళితే.. హోషియార్పూర్లో శనివారం రాత్రి జరిగిన పెళ్లి వేడుకల్లో భాగంగా డీజే పార్టీ ఏర్పాటు చేశారు. అశోక్ ఖోస్లా తన కూతురు వివాహం వైభోవోపేతంగా జరపాలని ఏర్పాట్లు ఘనంగా చేశారు.

కాగా, వేడుకగా జరుగుతున్న ఈ డీజే పార్టీని సాక్షి అరోరా అనే యువతి తన ఇంటిపై నుంచి తిలకిస్తోంది. ఇంతలో వధువు తండ్రి అశోక్ ఖోస్లా, అతని స్నేహితుడు అశోక్ సేథీ అత్యుత్సాహంతో తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ భవనంపై ఉన్న ఆ యువతి తలకు తగలడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో అప్పటి వరకు వేడుకగా సాగిన కార్యక్రమం నిర్మానుష్యంగా మారింది. మృతురాలు గత సంవత్సరమే ఎంబీఏ పూర్తి చేసింది.
మృతురాలి చరణ్జిత్ అరోరా తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. కాల్పులు జరిపిన అశోక్ ఖోస్లాను అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు అశోక్ సేథీ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
పోలీసులు, ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా.. పెళ్లి వేడుకల్లో ఈ తుపాకీ సంస్కృతిని ఉత్తరాది రాష్ట్రాలు వీడకపోవడం ఆందోళనకర విషయమే. కాగా, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications