కేజ్రీ ఎమ్మెల్యేని కొట్టిన మహిళ: విశాఖలో ఎఎపి సమైక్యం
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) శాసన సభ్యులు దినేష్ మోహానియా పైన ఓ మహిళ చేయి చేసుకుంది. తన నియోజకవర్గం సంగం విహార్లో నీటి కొరత సమస్యపై అధ్యయనం చేసేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. ఇదంతా తనపై జరుగుతున్న కుట్రలో భాగమని మండిపడ్డారు.
వాటర్ మాఫియా కారణంగా సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదు వస్తే తాను వెళ్లానని, అక్కడకు వాటర్ మాఫియా రాకుండా, మహిళలను పంపించారని విమర్శించారు. మరోవైపు ఎమ్మెల్యే పైన వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దినేష్ మోహానియా పైన ఓ మహిళ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎఎపి నేతలు కౌంటర్ ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు ఇరువైపుల ఫిర్యాదును తీసుకున్నారు.
దక్షిణ ఢిల్లీలో వాటర్ మాఫియా సమస్యలు సృష్టిస్తోందంటూ ఫిర్యాదు రావడంతో ఆదివారం సాయంత్రం సంగమ్ విహార్ హెచ్ బ్లాకుకు స్థానిక ఎమ్మెల్యే దినేష్ వెళ్లారు. అప్పుడు పలువురు మహిళలు, ఎఎపి నేతల మధ్య వాగ్వాదం జరిగింది.
విశాఖలో ఎఎపి సమైక్య నినాదం
విశాఖ సాగరతీరంలో ఆదివారం నిర్వహించిన 5కె రన్లో మాత్రం ఎఎపి అభిమానులు సమైక్య నినాదాలతో హోరెత్తించారు. జై సమైక్యాంధ్ర అంటూ ఎఎపి అభిమానులు చేసిన నినాదాలు, ప్రదర్శించిన ప్లకార్డులు హాట్ టాపిక్గా మారాయి. పార్టీ టోపీలు ధరించి మరీ జెండాలు చేతపట్టుకుంటూ ప్రధాన కూడళ్ళ వద్ద సమైక్య నినాదాలు చేశారు.
తెలంగాణ కౌరవ సేవలను తరమాలని, సమైక్య నినాదం అంతటా వినిపించాలని, ఢిల్లీ పీఠం చేరాలనంటూ నినాదాలు చేశారు. 5కె రన్ కార్యక్రమంలో భాగంగా ఎఎఫికి చెందిన వారంతా పాల్గొని తన శరీరానికి పోస్టర్లను తగిలించి మరీ సమైక్య నినాదాలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.