ఆమె ఖాతాలో వంద కోట్ల జమ అయ్యాయి.జోక్యం చేసుకోవాలని ప్రధానికి లేఖ
తన జన్ ధనబ్యాంకు ఖాతాలో వంద కోట్ల రూపాయాలను జమ కావడాన్ని గుర్తించి ఓ మహిళ షాక్ కు గరయ్యారు. ఈ విషయమై బ్యాంకు అధికారుల నుండి సరైన స్పందన లేకపోవడంతో ఆమె ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు.
ఘజియాబాద్ :పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత నల్ల ధనాన్ని మార్చుకొనేందుకు అక్రమార్కులు వక్రమార్గాలను పడుతున్నారు. చాలాకాలంగా ఉపయోగంలో లేని బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తున్నారు. లేదా జన్ ధన్ బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తున్నారు. అక్రమార్కులకు కొందరు బ్యాంకు అధికారులు కూడ తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. అయితే ఓ మహిళ తన బ్యాంకు ఖాతాలో వంద కోట్లు నగదు జమ అయిందని ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసింది. ఈ విషయమై బ్యాంకు అధికారుల సుండి సరైన సమాచారం రాని కారణంగానే ఆమె ప్రధానమంత్రికి లేఖ రాసింది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో శీతల్ అనే యువతి జన్ ధన్ అకౌంట్లో సుమారు వంద కోట్ల రూపాయాల నగదు జమ అయింది. శీతల్ తన బ్యాంకు ఖాతాలో వంద కోట్ల రూపాయాలు జమ అయిన విషయాన్ని ఆమె గుర్తించారు. అయితే పొరపాటు పడ్డాననే ఆమె భావించి , మరో రెండు మూడు ఎటిఎంలలో కూడ తన బ్యాలెన్స్ ను చెక్ చేసుకొంది.
అక్కడ కూడ తన ఖాతాలో వంద కోట్ల రూపాయాలు ఉన్న విషయాన్ని ఆమె గుర్తించింది. ఈ విషయాన్న వెంటనే ఆమె తన భర్తకు చెప్పింది. భార్య,భర్తలిద్దరూ కలిసి ఎస్ బి ఐ బ్రాంచ్ కు వెళ్ళారు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ ను కలిసేందుకు ప్రయత్నించారు.అయితే బ్యాంకు మేనేజర్ లేడని వారిని తిప్పిపంపారు.
మరునాడు కూడ బ్యాంకుకు వెళ్ళిన వారికి నిరాశే ఎదురైంది. అయితే మేనేజర్ వారిని కలవలేదు. ఏవో కారణాలను చెప్పి పంపారు.దీంతో అనుమానం వచ్చిన ఆ భార్య ,భర్తలు ప్రధానమంత్రి కార్యాలయానికి ఓ మెయిల్ పంపారు. తన ఖాతాలో వంద కోట్ల రూపాయాలను జమ చేసిన విషయాన్ని ఆమె వివరించారు.