దారుణం: భార్య మానానికి లక్షన్నర వెలకట్టిన భర్త
నలుగురు వ్యక్తులు తన భార్యను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసును విచారించిన పోలీసులు ఈ కేసును ఛేదించారు. తమ విచారణలో మొదటి నిందితుడు బాధితురాలి భర్త అయిన ఫిర్యాదుదారే అని పోలీసులు తేల్చారు. డబ్బు మీద ఆశతోనే నిందితుడు తన భార్యను ఈ విధంగా చేశాడని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన నిందితుడు ఇస్సార్ అలీ లష్కర్ తన భార్యను ఒక్క రాత్రి పంచుకోవడానికి తన నలుగురు స్నేహితులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
నవంబర్ 30న బెంగాల్ రాష్ట్రం నుంచి మహారాష్ట్రలోని మంఖుర్డ్ రైల్వే స్టేషన్కు నిందితుడు ఇస్సార్ అలీ లష్కర్ తన భార్యతోపాటు చేరుకున్నాడు. ముంబైలో ఒక ఏడాదిపాటు ఉందామని చెప్పి తన భార్యను ఇక్కడికి తీసుకొచ్చాడు నిందితుడు. ఆ తర్వాత తన స్నేహితులకు ఫోన్ చేసి ఇక్కడికి రావాలని కోరాడు. దీంతో అతని స్నేహితులు మోబిన్ ఖురేషి(40), సాజిద్ ఖురేషి(24), నిజాంఖాన్ (25), సుజిత్ కుమార్ చౌరాసియా(43) మంఖుర్డ్కు చేరుకున్నారు. తన స్నేహితులతోపాటు ఒక ఆటోలో కూర్చోవాలని చెప్పడంతో అతని భార్య ఆటోలో కూర్చుంది.
ఆటోలో కూర్చోగానే నలుగురు నిందితులు ఆమెను భేగన్వాడిలోని జాకీర్నగర్ తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని వారు రాత్రి 1.30గంటలకు తిరిగి తీసుకురాకపోవడంతో లష్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నలుగురు నిందితులను పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులు జరిపిన విచారణలో ఒప్పందం విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు డిసెంబర్ 7వరకు రిమాండ్ విధించారు. కాగా బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.