మాజీ మంత్రిపైకి చెప్పు విసిరిన మహిళ... తిరిగి వేసుకోనని స్పష్టం
ఈడీ దాడిలో రూ.50 కోట్ల నగదు, బంగారు ఆభరణాలతో పట్టుబడి, ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీపైకి ఓ మహిళ చెప్పు విసిరింది. ఈడీ అధికారులు ఆయన్ను ఆసుపత్రి నుంచి బయటకు తీసుకువచ్చినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. బెంగాల్ లోని అంతాలా ప్రాంతానికి చెందిన శుబ్రా ఘోరుయ్ అనే మహిళ ఈ చెప్పు విసరగా, అది గురి తప్పి ఛటర్జీ పక్కన పడింది. మా పిల్లలు ఉద్యోగాలు లేకుండా రోడ్లమీద తిరుగుతుంటే ఇలాంటి నాయకులు కట్టలు కట్టలు నగదు దాచుకునేందుకు మేడలు కడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతణ్ని తాడుకు కట్టి లాగాలంటూ వ్యాఖ్యానించింది. తనలా రాష్ట్రంలో ఆగ్రహంతో ఉన్న ప్రజలందరి స్పందనే ఈ చెప్పు విసరడం అని చెప్పింది. తాను మళ్లీ ఆ చెప్పులు వేసుకోనని, ఉత్త కాళ్లతోనే ఇంటికి వెళతానని మీడియాకు వివరించారు.
ఈ ఘటన అనంతరం ఈడీ అధికారులు ఛటర్జీని ఆసుపత్రి ఆవరణ నుంచి తీసుకువెళ్లారు. కుట్రకు బలయ్యానంటూ వ్యాఖ్యానించిన ఆయనకు సంబంధించిన కోల్ కతాలోని మరో రెండు ఫ్లాట్లు, ఓ దుకాణంలో ఈడీ అధికారులు మళ్లీ సోదాలు నిర్వహించారు. ఈ కేసులో పార్థాతోపాటు అరెస్టయిన ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ లావాదేవీలకు సంబంధించిన జీఎస్టీ నెంబరు సరైనదేనా? కాదా? అన్న కోణంలోను ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. పన్ను ఎగవేయడానికే ఈ నంబరు వాడివుంటారని అధికారులు భావిస్తున్నారు.

పార్థా ఛటర్జీ అరెస్ట్ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దుమారం రేపింది. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించిన ఛటర్జీ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి అక్రమాలకు పాల్పడి భారీగా నగదు కూడబెట్టారనే సమాచారంతో ఈడీ సోదాలు నిర్వహించి మంత్రిని అరెస్ట్ చేసింది. అనంతరం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అతడిని ప్రస్తుత మంత్రి పదవి నుంచి తొలగించారు.












Click it and Unblock the Notifications