కళ్లు పొడిచి మరీ చిన్నారిని హత్య చేసిన సవతితల్లి
హైదరాబాద్: ముంబైలో దారుణం జరిగింది. మానసిక స్థితి సరిగ్గా లేని 6 ఏళ్ల చిన్నారిని సవతి తల్లి అత్యంత దారుణంగా హింసించి, హత్య చేసిన ఘటన బందూప్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
అత్యంత దారుణంగా హింసించబడి అనుమానాస్పదంగా మరణించిన పాప మృతదేహాన్ని గుర్తించిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఒళ్లంతా తీవ్ర గాయాలు, రెండు కళ్లు పొడిచి అచేతనంగా పడి ఉన్న పాయల్ (6) మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
చిన్నారి హత్యకు గురైన విధానాన్ని చూసి పోలీసులు నివ్వెరపోయారు. ఐరన్ రాడ్లతో కొట్టడం, బ్లేడుతో కోయడం, గుండు పిన్నులతో గుచ్చడం లాంటి చిత్రహింసలతో పాటు, చిన్నారి కళ్లను పదునైన ఆయుధంతో పొడిచిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయని బందూక్ పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ములుంద్ జనరల్ ఆసుపత్రికి తరలించామన్నారు. కాగా, ముంబైలో ఆటోడ్రైవర్గా జీవనం సాగిస్తున్న రాజేష్ మొదటి భార్యకు ఇద్దరు ఆడపిల్లలు. మాయూరి (8), పాయల్ (6). భార్య భర్తల మధ్య ఏవో మనస్ఫర్ధలు రావడంతో 2011లో పిల్లలను భర్త వద్దే వదిలిపెట్టి పోయింది.
దీంతో రాజేష్ 2013లో నిందితురాలైన ప్రతిభను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. పాయల్ మానసిక వికలాంగురాలు కావడంతో చిన్నారి అత్యంత క్రూరంగా నిత్యం చిత్ర హింసలకు గురిచేసేది. ఈ క్రమంలో సోమవారం రాత్రి పాయల్ను తీవ్రంగా కొట్టి, గొంతు నులిమి హత్య చేసింది.
పాయల్ హత్యపై రాజేష్ను ప్రశ్నించగా తాను ఉదయాన్నే వెళ్లి రాత్రికి గాను ఇంటికి తిరిగి వస్తానని తెలిపాడు. తన భార్యే పాయల్ను నిత్యం చిత్రహింసలకు గురిచేస్తూ ఉండేదని విచారణలో వెల్లడించాడని పోలీసులు తెలిపారు. దీంతో ప్రతిభను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నారు.