షాక్: తెలుసుకునేందుకు 45 మంది ఉద్యోగినుల దుస్తులు విప్పించి..
కొచ్చిన్: కేరళ రాష్ట్రంలో మహిళా ఉద్యోగుల దుస్తులు విప్పి చెక్ చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయివేటు కంపెనీలో ఉపయోగించిన శానిటరీ నాప్కిన్ను టాయిలెట్లో వదిలేశారు. దానిని అక్కడ ఎవరు వదిలారో తెలుసుకునేందుకు ఆ కంపెనీలో పని చేసే మహిళా ఉద్యోగుల దుస్తులు విప్పించి చూశారు.
దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు లేడీ సూపర్ వైజర్ల పైన కేసు పెట్టారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఈ సంఘటనలో జోక్యం చేసుకుంది. డిసెంబర్ 10వ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆ రోజు ఉపయోగించిన శానిటరీ నాప్కిన్ను బాత్రూంలో లేడీ సూపర్ వైజర్స్ చూశారు. అది ఎవరు అక్కడ వదిలారో తెలుసుకునేందుకు 50 ఏళ్ల లోపు ఉన్న మహిళలను చెక్ చేయమని వారు ఆదేశించారు. దాదాపు 45 మంది మహిళలను అవమానకరరీతిలో చెక్ చేశారు. ఎవరైతే రుతుక్రమంలో ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు.
నాలుగు రోజుల క్రితం దీనికి సంబంధించి ఫిర్యాదు అందింది. పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఫిర్యాదును మహిళా పోలీసు సెల్కు అప్పగించారు. ఆదివారం నాడు స్థానిక పోలీసు స్టేషన్ నుండి తమకు కేసు ట్రాన్సుఫర్ అయిందని, దీనిపై విచారణ జరుపుతామని మహిళా పోలీసు సెల్ చెప్పింది.
దీని పైన కేరళ మహిళా కమిషన్ సభ్యురాలు లిస్సీ జోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత వ్యక్తుల పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని, ఇది చాలా అవమానకరమైన సంఘటన అన్నారు. కంపెనీ మేనేజ్మెంట్ నుండి తాము వివరణ కోరుతామని చెప్పారు. కాగా, మేనేజ్మెంట్ పైన ఎవరు ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీని పైన కంపెనీ యాజమాన్యం స్పందించవలసి ఉంది.