జాతి వ్యతిరేకులపై చర్యలు తీసుకోండి: రాజ్నాథ్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జేఎన్యూ( జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ) వద్ద జాతి వ్యతిరేక నినాదాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ పోలీసులకు ఆదేశించారు.
పార్లమెంట్పై దాడి కేసులో దోషిగా తేలిన అప్జల్గురు ఉరితీతకు వ్యతిరేకంగా జేన్యూ విద్యార్థులు ఇటీవల ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ శుక్రవారం స్పందించారు.
జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని తాము సహించమని స్పష్టం చేశారు. అలాంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తాను పోలీసు అధికారులకు సూచించినట్లు రాజ్నాథ్సింగ్ వెల్లడించారు.
ఇది ఇలా ఉండగా, రెండ్రోజుల క్రితం న్యూఢిల్లీలోని ప్రెస్క్లబ్లో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీ జాఫర్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే అలీ జాఫర్ బృందంలోని కొందరు ‘కాశ్మీర్ లేకర్ రెహెనేజ్', ‘అఫ్జల్ గురు అమర్ రహే' అంటూ దేశ వ్యతిరేక, ఉగ్రవాదులకు మద్దతుగా నినాదాలు చేశారు.
అంతేగాక, అఫ్జల్ గురు చిత్రాలను కూడా అక్కడ ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్కు పిసిఐ షోకాజు నోటీసులు పంపింది. అయితే, తన బృందంలోని కొందరు ఇలా నిరసనలు వ్యక్తం చేస్తారని తనకు తెలియని చెప్పారు ప్రొఫెసర్.
‘నా దృష్టికి వచ్చిన వెంటనే నినాదాలు చేయొద్దని వారించా. కానీ, వారు వినలేదు' అని మీడియాతో జాఫర్ చెప్పడం గమనార్హం. 2001లో పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి జరిపిన కేసులో నిందితుడైన అఫ్జల్ గురును 2013లో ఉరితీయడం జరిగింది.
విద్యార్థి సంఘం నేత అరెస్ట్
దేశ రాజధానిలోని జవహర్లాల్ నేషనల్ యూనివర్సిటీలో వివాదం నేపథ్యంలో జేఎన్యూ విద్యార్థి సంఘ ప్రెసిడెంట్ కన్హయ్యా కుమార్ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
మాతృభూమి వ్యతిరేక వ్యాఖ్యలు సహించబోం: స్మృతి ఇరానీ
మాతృదేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే సహించబోమని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. ఢిల్లీలోని జేఎన్యూ(జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ) వద్ద ఆందోళనకారుల నినాదాలను స్మృతి తీవ్రంగా ఖండించారు.
పార్లమెంట్పై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్గురు ఉరితీతకు వ్యతిరేకంగా జేఎన్యూ విద్యార్థులు మంగళవారం ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఈ ఘటనపై కేసు నమోదైంది. కాగా, జేఎన్యూలో అఫ్జల్ గురుకు మద్దతుగా కార్యక్రమం నిర్వహించడం ఇది నాలుగోసారి.