వరల్డ్ కప్ టికెట్ల బుకింగ్స్ షురూ: ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ ఇదే..!!
ముంబై: ఐసీసీ వరల్డ్ కప్.. ఇంకో మూడు నెలల్లో ఈ బిగ్గెస్ట్ క్రికెట్ ఈవెంట్ ఆరంభం కాబోతోంది. దీనికోసం క్రికెట్ ఆడే అన్ని దేశాలు సన్నద్ధమౌతోన్నాయి. ద్వైపాక్షిక సిరీస్తో తీరిక లేని షెడ్యూల్స్ను ఎదుర్కొంటోన్నాయి. ఇది 13వ ఎడిషన్ వరల్డ్ కప్. ఇప్పటివరకు 12 మెగా టోర్నమెంట్లు ముగిశాయి. అత్యధికంగా ఆస్ట్రేలియా అయిదుసార్లు ఛాంపియన్గా నిలిచింది.
ఈ టోర్నీలో భాగంగా అక్టోబర్ 8వ తేదీన టీమిండియా తన తొలి మ్యాచ్ను ఆడనుంది. బలమైన ఆస్ట్రేలియాతో తలపడుతుంది. 11వ తేదీన రెండో మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ను ఢీ కొడుతుంది. ఆ తరువాత జరిగే గేమ్లో అంటే.. తన మూడో మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఎదుర్కోనుంది రోహిత్ సేన. ఈ మ్యాచ్కు గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.

ఈ టోర్నమెంట్ మొత్తం మీద 58 మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో 10 వార్మప్స్. దేశంలో 12 స్టేడియాలు ఈ మ్యాచ్లకు ఆతిథ్యాన్ని ఇవ్వబోతోన్నాయి. ఈ మెగా టోర్నమెంట్కు మ్యాచ్ల టికెట్ల విక్రయాలు గురువారం నుంచే మొదలు కానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసింది బీసీసీఐ.
మ్యాచ్లను తిలకించడానికి విక్రయించే టికెట్లన్నింటినీ బుక్ మై షో ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వరల్డ్ కప్ 2023 మ్యాచ్ల టికెట్లను విక్రయించడానికి బీసీసీఐ ఈ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ను ఎంచుకుంది. ప్రపంచకప్ అఫీషియల్ టికెటింగ్ ప్లాట్ఫామ్గా ప్రకటించింది.

టికెట్ల విక్రయాల్లో ఎలాంటి అవకతవకలు, లోటుపాట్లు, గందరోగోళం నెలకొనకుండా ఉండటానికే బుక్ మై షోను అధికారిక టికెటింగ్ ప్లాట్ఫామ్గా ఎంపిక చేసినట్లు బీసీసీఐ తెలిపింది. ఆన్లైన్ ద్వారా టికెట్లను విక్రయించడంలో ఈ సంస్థకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది.
ఆగస్టు 24, 29 తేదీల్లో సాయంత్రం 6 గంటల నుంచి మాస్టర్కార్డ్ ప్రీ-సేల్తో టికెట్ల విక్రయాలు మొదలుకానున్నాయి. వార్మప్ మ్యాచ్లు మినహా అన్నింటికీ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి మాస్టర్ కార్డ్ ప్రీ-సేల్ ద్వారా సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ల టికెట్లను కొనుగోలు చేయవచ్చు.












Click it and Unblock the Notifications