16 కోట్ల అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ ఇచ్చినా ఆగని మృత్యువు .. అనారోగ్యంతో ఏడాది పాప వేదిక మృతి !!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 16 కోట్ల రూపాయల విలువ చేసే ఇంజక్షన్ తీసుకున్న ఏడాది పాప వేదిక సౌరబ్ షిండే మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ కూడా పాప ప్రాణాలను కాపాడలేకపోయింది . జన్యుపరమైన రుగ్మత కారణంగా ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడిన ఒక సంవత్సరం వయసున్న వేదికా సౌరభ్ షిండే పూణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో కన్నుమూసింది . వేదిక మృతితో ఆమె కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ జోల్జెన్స్మా ఇచ్చిన వైద్యులు
మహారాష్ట్ర పూనెకు చెందిన వేదిక కేంద్ర నాడీ వ్యవస్థ, స్వచ్ఛంద కండరాల కదలికను ప్రభావితం చేసే అరుదైన జన్యు వ్యాధి అయిన వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతోంది. వివిధ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫారమ్ల ద్వారా రూ .16 కోట్లు సేకరించిన తర్వాత ఆమెకు గత నెలలో హాస్పిటల్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ జోల్జెన్స్మా ఇచ్చారు వైద్యులు . అయినా అంత ఖరీదైన ఇంజెక్షన్ కూడా పాప మృత్యువును ఆపలేకపోయింది.
శ్వాస సమస్యతో పాప వేదిక మృతి
13 నెలల వేదిక మరణవార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె ఆరోగ్యం ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల మెరుగుపడుతుందని భావించిన వారు పాప మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.నిన్న సాయంత్రం ఆరోగ్యంగానే ఉన్న వేదిక అకస్మాత్తుగా ఆమెకు శ్వాస సమస్య వచ్చిందని ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించామని తండ్రి పేర్కొన్నారు. భోసారి ఆసుపత్రిలో మొదట వైద్యం అందించిన తర్వాత , పాపను దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రికి తీసుకెళ్లామని, వెంటనే వెంటిలేటర్ సపోర్ట్ చేశారన్నారు. ఆమె ప్రాణాలను కాపాడటానికి వైద్యులు అన్ని ప్రయత్నాలు చేసారు కానీ దురదృష్టవశాత్తు పాప మరణించిందని చెప్పారు.
ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత పాప ఆరోగ్యంలో మెరుగుదల
ఎన్ని ప్రయత్నాలు చేసినా పాపని కాపాడుకోలేకపోయామని వేదిక తండ్రి సౌరభ్ షిండే కన్నీటిపర్యంతమయ్యారు. గత నెలలో వేదికకి ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత, ఆమె పరిస్థితి మెరుగుపడిందని, ఇంజెక్షన్ ఇచ్చే ముందు ఆమె ఎప్పుడూ కదలకుండా మంచం మీద పడుకునేదని, కానీ ఇంజక్షన్ తర్వాత, ఆమె ఆరోగ్యంలో మెరుగుదల కనిపించిందని, ఆమె శరీర కదలికలు కనిపించాయని, గత నెలలో తాము ఆమె పుట్టినరోజును కూడా జరుపుకున్నామని తండ్రి వెల్లడించారు.
ప్రపంచం నలుమూలల నుండి పాప కోసం ఎంతో సహాయం .. అయినా విధి ఫలితం : తండ్రి ఆవేదన
మేము మూడు నెలల పాటు అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పారన్నారు. కానీ ఊహించని విధంగా పాప తీవ్ర అనారోగ్యానికి గురై మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పాపకు వైద్యం చేయించడానికి 16 కోట్ల రూపాయలు ప్రపంచ నలుమూలల నుండి సహాయం చేశారని, వారందరూ పాప కోలుకోవాలని కోరుకున్నారని, అయినప్పటికీ విధి తమ పాపను తమకు దూరం చేసిందని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.