రచయిత్రి అరుంధతీ రాయ్ అవార్డు వాపసీ
న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత్రి, బుకర్ ప్రైజ్ విజేత అరంధతీ రాయ్ తన అవార్డును వెనక్కి ఇచ్చేసి మత అసహనంపై తన స్పందనను వ్యక్తం చేశారు. 1989లో ఆమెకు ఉత్తమ స్ర్కీన్ ప్లే అవార్డు వచ్చింది. ఈ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ఆమె ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంగ్ల పత్రిక ద్వారా తెలియజేశారు. దేశంలో జరుగుతున్న సంఘటనలపై రచయితలు, కళాకారులు స్పందిస్తున్న తీరు అద్భుతంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
తాను అవార్డును వెనక్కి ఇవ్వడం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా తాను వ్యవహరిస్తున్నాననీ, గతంలో 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలకు అసహనం అనే పదం కంటే ఇంకా ఏమైనా భారీ పదం చూసి వాడాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. సైద్ధాంతిక విషప్రచారానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో తాను అవార్డు వెనక్కి ఇవ్వడాన్ని గర్వంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.
స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేనప్పుడు బౌద్ధిక పోషకాహార లోపంతో బాధపడుతున్న సమాజం వస్తుందని, మూర్ఖుల దేశం ఏర్పడుతుందని ఆమె అన్నారు. కాగా, బాలీవుడ్ దర్శకుడు కుందన్ షా కూడా తనకు వచ్చిన జాతీయ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించేశారు. అరుంధతీ రాయ్ చెప్పిన మాటలతో తాను ఏకీభవిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.