మోడీకి షాకిచ్చిన సిద్ధూకు భార్య ఝలక్, కేజ్రీవాల్ సెల్యూట్
చండీగఢ్: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఆయన భార్య ఝలక్ ఇచ్చారు. తాను భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానని ఆమె చెప్పారు. సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారని, ఏఏపీ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి కావొచ్చునని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
రాజ్యసభకు సిద్ధూ రాజీనామా నేపథ్యంలో ఆయన భార్య కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీనిపై ఆమె మంగళవారం స్పందించారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని ఆమె స్పష్టం చేసారు. తాను ఎమ్మెల్యే పదవికి మాత్రమే రాజీనామా చేశానని, పార్టీకి రాజీనామా చేయలేదన్నారు.

తన భర్త సిద్ధూ మాత్రం బీజేపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారని చెప్పారు. సిద్ధూ పంజాబ్కు సేవ చేయాలని భావిస్తున్నారని, ప్రజాసేవలో ఆయనకు తనవంతు సహకారాన్ని అందిస్తానని వెల్లడించారు. ఎంపీగా తన భర్త రాజీనామాతో తనకు పదవిలో కొనసాగే హక్కు లేదని భావించే రాజీనామా చేశానని చెప్పారు.
తాను ఎట్టి పరిస్థితుల్లోను బీజేపీని వీడబోనని చెప్పారు. తాను తన భర్త దారిలో (బీజేపీని వీడిది లేదని) నడవనని చెప్పారు.
ఇదిలా ఉండగా, సిద్ధూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. పంజాబ్ రాష్ట్రానికి సేవ చేసేందుకు సిట్టింగ్ ఎంపీ సిద్ధూ రాజీనామా చేశారని, అతని ధైర్యానికి తాను ఆయనకు సెల్యూట్ చేస్తున్నానని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications