Free Gas Cylinder : దీపావళికి గ్యాస్ సిలెండర్ ఫ్రీ-యోగీ ఆదిత్యనాథ్ కానుక..
యూపీలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల లబ్దిదారులకు సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఇవాళ శుభవార్త చెప్పారు. ఇప్పటికే కేంద్రం ఉజ్వల గ్యాస్ కనెక్షన్లపై దాదాపు 500 రూపాయల మేర తగ్గింపు ఆఫర్ ప్రకటించగా.. ఇప్పుడు యూపీలో వారికి యోగీ సర్కార్ మరో ఆఫర్ ప్రకటించింది. దీపావళి సందర్భంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కలిగిన వారికి ఉచితంగా ఓ సిలెండర్ ఇవ్వాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్ నిర్ణయించారు.
ఉజ్వల పథకం లబ్ధిదారులకు దీపావళి కానుకగా ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ బులంద్ షహర్ లో ప్రకటించారు. బులంద్షహర్లో జరిగిన ఓ కార్యక్రమంలో రూ.632 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం యోగీ ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈ ప్రాజెక్టులలో ప్రారంభోత్సవం చేసిన రూ.208 కోట్ల విలువైన 104 ప్రాజెక్టులు, శంకుస్థాపన చేసిన రూ.424 కోట్ల విలువైన 152 ప్రాజెక్టులు ఉన్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్వల యోజన ద్వారా ప్రతి కుటుంబానికి సిలిండర్ ధరలను రూ.300 తగ్గించడం ద్వారా బహుమతిని అందించారని యోగీ తెలిపారు. ఇప్పుడు తాము ప్రతీ ఉజ్వల యోజన కనెక్షన్ లబ్ధిదారునికి దీపావళి కానుకగా ఒక వంట గ్యాస్ సిలిండర్ను ఉచితంగా అందించాలని నిర్ణయించామన్నారు. 2014లో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు పొందడం చాలా కష్టమైన పని అని యోగి ఆదిత్యనాథ్ గుర్తుచేశారు. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే సుమారు 1.75 కోట్ల కుటుంబాలు ఉజ్వల పథకం ద్వారా లబ్ది పొందాయని ఆయన చెప్పారు.
అలాగే బీజేపీ ఇప్పటివరకూ అందిస్తున్న పథకాలను యోగీ గుర్తుచేస్తూ.. పిఎం ఆవాస్ యోజన కింద ఉత్తరప్రదేశ్లో 55 లక్షల మంది మహిళలు ఇంటి యజమానులుగా మారారని, స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద రాష్ట్రంలో 2.75 లక్షల మరుగుదొడ్లు నిర్మించామని తెలిపారు. తొమ్మిదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో మనమందరం కొత్త భారతదేశాన్ని చూశామని ఈ కొత్త భారతదేశం సంపన్నమైనది, శక్తివంతమైనది, స్వావలంబనతో కూడుకున్నదన్నారు.












Click it and Unblock the Notifications