మానస సరోవర్ యాత్రికులకు యోగి వరం, 2024లో ప్రధాని!
కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లే భక్తులకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రూ.లక్ష ఇస్తుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. లక్నో, నోయిడా, ఘజియాబాద్లో ఒకచోట కైలాస్ మానస సరోవర్ భవన్ నిర్మిస్తామన్నారు.
లక్నో: కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లే భక్తులకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రూ.లక్ష ఇస్తుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. లక్నో, నోయిడా, ఘజియాబాద్లో ఒకచోట కైలాస్ మానస సరోవర్ భవన్ నిర్మిస్తామన్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి గోరఖ్పూర్ చేరుకున్న ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా గోరఖ్పూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
బీజేపీకి ఘనవిజయం అందించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా సబ్కా సాథ్ - సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకు వెళ్తుందన్నారు. అన్ని వర్గాల వారి అభివృద్ధికి తోడ్పడతామన్నారు.
ముఖ్యమంత్రి పదవి అంటే..
యూపీలో అవినీతి లేకుండా చేస్తామని చెప్పారు. పదిహేనేళ్లుగా నిలిచిపోయిన అభివృద్ధిని తాము పట్టాలెక్కిస్తామన్నారు. బాలికలు, మహిళల రక్షణకే యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి పదవి అనేది అధికారం కోసం కాదని, బాధ్యతలు నెరవేర్చడానికి అన్నారు.
గూండారాజ్కు, అవినీతికి తావుండదని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తాను బాధ్యతలు స్వీకరించాక పలువురు బాలికల నుంచి ఫోన్లు వచ్చాయని, ఆకతాయిల వేధింపుల గురించి వారు వాపోయారని, చాలామంది మధ్యలోను చదువులు ఆపేశామన్నారని, దీంతో బాలికలు, మహిళల రక్షణకు యాంటీ-రోమియో స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ మార్గదర్శకాలను పాటించే కబేళాలను నిషేధించబోమన్నారు.
ప్రధానమంత్రి కావాలని..
యోగి ఆదిత్యనాథ్ కేవలం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే సరిపోలేదని, 2024లో ఆయన్ను ప్రధానమంత్రిని చేయాలని మద్దతుదారులు అంటున్నారు. అయిదు దఫాలుగా గోరఖ్పూర్ ఎంపీగా ఉంటున్న ఆదిత్యనాథ్.. సీఎం అయ్యాక తొలిసారి శనివారం ఇక్కడకు వచ్చారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు గోరక్పూర్ ఆలయానికి బారులు తీరారు.
మోడీలాగే..
ఆయన పరిపాలన, పారిశుద్ధ్య కార్యక్రమాలకు ముగ్ధులైన పూర్వాంచల్ వాసులు.. ప్రధాని మోడీ లాగే ఆదిత్యనాథ్ కూడా కఠిన సమస్యలను పరిష్కరించగల సమర్థుడని, 2024లో ప్రధాని బాధ్యతలను చేపట్టడానికి అర్హుడని భావిస్తున్నారు. మోడీలాగే ఈయనా ఒంటరివాడని, తన కుటుంబం గురించి ఆలోచించరని, అవినీతికీ పాల్పడరని, రాష్ట్ర సేవే ఆయనకు పరమావధి అని, ఆ తర్వాత దేశానికి సేవ చేస్తారని అంటున్నారు.
చర్యలు
కాగా, యూపీలో మహిళతో యాసిడ్ తాగించిన నిందితుల్లో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. బాధితురాలిని సీఎం పరామర్శించిన కొద్ది గంటల్లోనే పోలీసులు.. రాయ్బరేలీలోని నిందితులు దిలీప్, అతడి అన్న ప్రదీప్లను అరెస్ట్ చేశారు. బాధితురాలితో ఆస్పత్రిలో సెల్ఫీలు దిగిన ముగ్గురు మహిళా పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. మెడికల్ వర్సిటీ వైస్ చాన్సలర్ను ఆదిత్యనాథ్ శనివారం తన వద్దకు పిలిపించారు.
వెంట ఆవుల మంద
ఇదిలా ఉండగా, యోగి ఆదిత్యనాథ్కు ఆవులు అంటే ఇష్టం. ఆయన ఆశ్రమంలో చాలా ఆవులు ఉన్నాయి. వాటిని ఆయన ప్రేమగా చూసేవారు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఆయన ఆశ్రమంలో ఉండలేరు. అధికార నివాసానికి తరలుతారు. అయితే, ఆయనతో పాటు ఆవుల మందను కూడా ఆయన ఆ భవనానికి తీసుకు వెళ్లనున్నారట.