యోగి ఆదిత్యనాథ్ 2.O: ప్రమాణ స్వీకారం తేదీ ఇదే: అదే సెంటిమెంట్..హోలీ కంటే ముందే
లక్నో: దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్లో వరుసగా రెండోసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో ఘన విజయాన్ని అందుకున్న తరువాత- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలపై దృష్టి సారించారు కమలనాథులు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తాలను చూసుకున్నారు కూడా. హోలీ కంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
403 నియోజకవర్గాలు ఉన్న ఉత్తర ప్రదేశ్లో బీజేపీ తన మిత్రపక్షాలతో కలుపుకొని 273 స్థానాలను గెలుచుకుంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. అవినీతి రహిత పరిపాలనను అందించడం, శాంతిభద్రతలను కాపాడటం, మహిళలకు రక్షణ కల్పించడం, విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలకు తోడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఛరిష్మా.. బీజేపీకి విజయానికి కారణాలయ్యాయంటూ విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఇక అందరి దృష్టీ ప్రమాణ స్వీకారం, మంత్రివర్గ కూర్పుపై నిలిచింది. పార్టీని ఒంటిచేత్తో గెలిపించిన నేపథ్యంలో- మంత్రివర్గ కూర్పు విషయంలో యోగి ఆదిత్యనాథ్కు స్వేచ్ఛను ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించినట్లు చెబుతున్నారు. తన సహచర మంత్రులుగా ఎవరెవరిని తీసుకోవాలనే విషయంపై ఇప్పటికే ఆయన స్పష్టతతో ఉన్నారు. కులాలు, ప్రాంతాలవారీగా మంత్రివర్గ సహచరులను ఎంపిక చేసుకునే అవకాశాలు లేకపోలేదు.
కాగా సెంటిమెంట్ ప్రకారం.. హోలీ పండగ కంటే ముందే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ నెల 15వ తేదీన ఈ కార్యక్రమం ఉండొచ్చని తెలుస్తోంది. 17, 18 తేదీల్లో హోలీ పండగ ఉన్నందున ఈ లోపే ప్రమాణ స్వీకారాన్ని చేయాలని యోగి ఆదిత్యనాథ్ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది.
Recommended Video
కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సహా 10 మంది మంత్రులు ఓడిపోయిన విషయం తెలిసిందే. ఛత్రపాల్ సింగ్ గంగ్వార్, రాజేంద్ర ప్రతాప్ సింగ్, చంద్రికా ప్రసాద్ ఉపాధ్యాయ, ఆనంద్ స్వరూప్ శుక్లా, ఉపేంద్ర తివారీ, రణ్వీర్ సింగ్ ధున్ని, లఖన్ సింగ్ రాజ్పుత్, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సతీష్ చంద్ర ద్వివేది- తమ ప్రత్యర్థి పార్టీ ఎస్పీ అభ్యర్థుల చేతుల్లో పరాజయం పాలయ్యారు. మంత్రివర్గ కూర్పులో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని అంటున్నారు.












Click it and Unblock the Notifications